27న సుప్రీంలో విచారణకు రానున్న కవిత పిటిషన్‌

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను ఇంటి వద్ద లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలంటూ భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఈ నెల 27న విచారణకు రానుంది.

Updated : 24 Mar 2023 05:26 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను ఇంటి వద్ద లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలంటూ భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఈ నెల 27న విచారణకు రానుంది. ఈ కేసులో ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ 16వ తేదీన మరోసారి హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పులు, క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 16వ తేదీన విచారణకు హాజరుకావాలనే నోటీసులు రద్దు చేయాలని కోరారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఎదుట కవిత తరఫు న్యాయవాదులు గత బుధవారం ప్రస్తావించారు. వెంటనే విచారణకు అంగీకరించని ప్రధాన న్యాయమూర్తి.. ఈ నెల 24న విచారించే కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీకి సూచించారు. అయితే, శుక్రవారం జాబితాలో ఈ కేసు లేదు. ఈ నెల 27వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను చేర్చారు.

మరోవైపు కవిత వేసిన పిటిషన్‌పై తమ వాదన వినాలంటూ ఈ నెల 18న ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని