గోదావరి నుంచి ఏటా సముద్రంలోకి 86,219 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు

గోదావరి నుంచి 2011-21 మధ్య ఏటా సగటున 86,219 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు, కృష్ణా నుంచి  12,993 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు సముద్రంలో కలిసినట్లు జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు.

Updated : 24 Mar 2023 05:32 IST

ఈనాడు, దిల్లీ: గోదావరి నుంచి 2011-21 మధ్య ఏటా సగటున 86,219 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు, కృష్ణా నుంచి  12,993 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు సముద్రంలో కలిసినట్లు జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లోక్‌సభలో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

తెలంగాణలో ‘రెరా’కు రెగ్యులర్‌ అథారిటీ, అప్పిలేట్‌ అథారిటీని తాత్కాలికంగానే నియమించారని, తీర్పులు ఇచ్చే అధికారిని నియమించలేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణలో రెరా కింద 5,689 ప్రాజెక్టులు అనుమతులు పొందగా 2,640 మంది ఏజెంట్లు ఉన్నారని, రెండు కేసులు మాత్రమే పరిష్కరించారని మంత్రి వెల్లడించారు. రెరా కింద ఆంధ్రప్రదేశ్‌లో 3,900 ప్రాజెక్టులు అనుమతులు పొందగా 175 మంది ఏజెంట్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. 228 కేసులను అథారిటీ పరిష్కరించిందని తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌ గెజిటెడ్‌ అధికారుల విభాగంలో గుంటూరు డివిజన్‌లో మొత్తం 690 (గ్రూప్‌-సిలో 304, లెవల్‌-1లో 386) పోస్టులు, సికింద్రాబాద్‌ డివిజన్‌లో 2908 (గ్రూప్‌-సిలో 1796, లెవల్‌-1లో1112) పోస్టులు ఖాళీలున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. నరసరావుపేట, వరంగల్‌, చేవెళ్ల, మహబూబాబాద్‌, పెద్దపల్లి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పసునూరి దయాకర్‌, డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత, బి.వెంకటేష్‌ నేతలు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టెక్నికల్‌, పారా మెడికల్‌, మినిస్టీరియల్‌ క్యాటగిరీల్లోని 3,347 పోస్టుల భర్తీకి 2019లో నోటిఫికేషన్‌ ఇవ్వగా 2,870 మంది ఉద్యోగాల్లో చేరారని మంత్రి వెల్లడించారు.

ఉడాన్‌ పథకంలో నాగార్జునసాగర్‌ వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుకు రూ.20 కోట్లు ప్రతిపాదించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ (రిటైర్డ్‌) తెలిపారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని