దద్దరిల్లిన విద్యుత్‌సౌధ

విద్యుత్తు ఉద్యోగుల మహాధర్నాతో శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. పీఆర్‌సీ సహా పలు సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (ఐకాస), ఉద్యోగుల సంఘం-హెచ్‌82 ఏక కాలంలో మహాధర్నాకు పిలుపునివ్వడంతో తరలివచ్చిన వేల మందితో ఖైరతాబాద్‌ ప్రధాన రహదారి రెండుగంటల పాటు పూర్తిగా స్తంభించింది.

Published : 25 Mar 2023 05:32 IST

పీఆర్‌సీ కోసం విద్యుత్తు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులు
రెండు గంటలకుపైగా రోడ్డుపైనే వేల మంది ఆర్టిజన్లు
ఏకకాలంలో అన్ని సంఘాల మహాధర్నా
గత ఏప్రిల్‌ నుంచి పెండింగులో ఉన్న పీఆర్‌సీని తక్షణం ప్రకటించాలని డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌, ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉద్యోగుల మహాధర్నాతో శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. పీఆర్‌సీ సహా పలు సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (ఐకాస), ఉద్యోగుల సంఘం-హెచ్‌82 ఏక కాలంలో మహాధర్నాకు పిలుపునివ్వడంతో తరలివచ్చిన వేల మందితో ఖైరతాబాద్‌ ప్రధాన రహదారి రెండుగంటల పాటు పూర్తిగా స్తంభించింది. ఉదయం 11 గంటలకే పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉద్యోగులతో విద్యుత్‌ సౌధ భవనం ప్రాంగణం మొత్తం అడుగుతీసి అడుగు వేయలేనంత సాయిలో నిండిపోయింది. అదనంగా వచ్చిన వేలమంది ప్రధాన రహదారిపైనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిలబడిపోయారు.ఆ తర్వాత వేలసంఖ్యలో వచ్చిన తాత్కాలిక ఉద్యోగులూ (ఆర్టిజన్లు) రోడ్డుపైనే నిలిచిపోయారు. ఖైరతాబాద్‌ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే మార్గం అత్యంత ప్రధానమైనది కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఖైరతాబాద్‌ సర్కిల్‌ నుంచి వాహనాలను పోలీసులు రాజ్‌భవన్‌ వైపు మళ్లించారు. అప్పటికే ధర్నా చేస్తున్న జనంలోకి చేరిన వాహనాలను ముందుకు పంపేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.దాదాపు వంద మీటర్ల పొడవునా రోడ్డుపై చేరిన ఉద్యోగులను ఒకవైపు తప్పిస్తుండగా మరోవైపు మరికొందరు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాహనాలకు అడ్డంగా బైఠాయించారు. రోడ్డుపై వేలమంది చేరి ట్రాఫిక్‌ అంతరాయం కల్పిస్తున్నా దాదాపు రెండు గంటల పాటు పోలీసులు సంయమనం పాటించడం గమనార్హం.

వేతన సవరణ ప్రకటించాలి

తెలంగాణ విద్యుత్‌ సంసల ఉద్యోగుల పాత వేతన ఒప్పందం గడువు 2022 మార్చి 31తో ముగిసింది. గత ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వేతన సవరణ (పీఆర్‌సీ) ప్రకటించాలన్నది ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండు. శుక్రవారం విద్యుత్‌ సౌధ ఆవరణలో ఏర్పాటుచేసిన సభావేదిక నుంచి ఐకాస ఛైర్మన్‌ జి.సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌, కోఛైర్మన్‌ శ్రీధర్‌, కో కన్వీనర్‌ బీసీరెడ్డిలు మాట్లాడుతూ తక్షణం వేతన సవరణ చేయాలని సంసల యాజమాన్యాలకు నోటీస్‌ ఇచ్చిన తరవాత మంత్రి జగదీశ్‌రెడ్డితో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో మహాధర్నా చేస్తున్నట్లు తెలిపారు. చర్చల సందర్భంగా యాజమాన్యాలు చేసిన విన్నపం మేరకు నిరసనను నాలుగు సార్లువాయిదా వేసుకున్నామన్నారు. 24 సంఘాలతో కూడిన ఐకాస ఆధ్వర్యంలో ‘చలో విద్యుత్‌ సౌధ’ కార్యక్రమం నిర్వహిస్తామని యాజమాన్యాలకు ముందే చెప్పడంతోపాటు ఈనెల 18న హైదరాబాద్‌, 20న వరంగల్‌, 21న పాల్వంచలలో సన్నాహక సమావేశాలూ నిర్వహించామన్నారు. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ మహాధర్నా చేపట్టినట్లు ప్రకటించారు. ఆలాగే 1999 నుంచి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడంతో పాటు ఆర్టిజన్ల సమస్యలనూవెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టిజన్లు చాలీ చాలని వేతనాలతో బతుకులువెళ్లదీస్తున్నారని, వారి పర్సనల్‌ పేను బేసిక్‌లో కలపాలని, తగినంత ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, శాశ్వత ఉద్యోగుల మాదిరి వారికీ వైద్య సదుపాయం కల్పించాలన్నారు. నగదు రహిత అన్‌ లిమిటెడ్‌ మెడికల్‌ పాలసీని అమలు చేయాలని, రూ.కోటి జీవితబీమా కల్పించాలని, ఈపీఎఫ్‌ ఉద్యోగులకూ పదవీ విరమణ తర్వాత వైద్య సదుపాయాలు కల్పించాలని, రిటైర్మెంట్‌ గ్రాట్యుటీని జీపీఎఫ్‌ ఉద్యోగులకు రూ.16లక్షలు, ఈపీఎఫ్‌ ఉద్యోగులు రూ.20లక్షలు చెల్లించాలని, హెచ్‌ఆర్‌ఏను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాయిలో ఇవ్వాలనే డిమాండ్లను వారు ప్రకటించారు. యాజమాన్యం స్పందించని పక్షంలో తదుపరి నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాలుస్తుందని వారు హెచ్చరించారు. ధర్నాలో ఐకాస నేతలు అనీల్‌, వజీర్‌, గోవర్ధన్‌, శ్యామ్‌ మనోహర్‌, వెంక్కన్న గౌడ్‌, సుధాకర్‌ రెడ్డి, తులసి నాగరాణి, కరుణాకర్‌రెడ్డి, రాంజీ, నేతలు నెహ్రూ, సదానందం, లోహిత్‌ ఆనంద్‌ తదితరులు, హెచ్‌82 ధర్నాలో సంఘం నేతలు సాయిలు, ఇతియాజ్‌ షాకీర్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని