Vande Bharat Express : తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాల సమాచారం.

Updated : 25 Mar 2023 07:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాల సమాచారం. నిర్వహణపరమైన ఏర్పాట్లతో అందుకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సంబంధిత రైల్వే డివిజన్ల అధికారులకు గురువారం రాత్రి సమాచారం అందించింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

వయా నల్గొండ, గుంటూరు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రధాని నరేంద్రమోదీ సంక్రాంతి రోజున ప్రారంభించిన తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. మూడు నాలుగువారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్‌ దొరకదు. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ,  నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్‌-కర్నూలు, వికారాబాద్‌-తాండూరు-రాయచూరు.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఏయే స్టేషన్లలో ఆగుతుంది, ఛార్జీలు, ప్రయాణ సమయంపై స్పష్టత రావాల్సి ఉంది.  వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్‌ 8న ప్రారంభించే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌లో ప్రారంభించిన నేపథ్యంలో రెండోదాన్ని తిరుపతిలో ప్రారంభించనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని