అగ్నిమాపక శాఖలో సెలవుల రద్దు

అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది వేసవికాలం పూర్తయ్యే వరకు అత్యవసర పరిస్థితుల్లో మినహా సెలవుల్లో వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

Updated : 25 Mar 2023 05:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది వేసవికాలం పూర్తయ్యే వరకు అత్యవసర పరిస్థితుల్లో మినహా సెలవుల్లో వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఫైర్‌ స్టేషన్లలో రోజువారీగా మస్టర్‌ పరేడ్‌ నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న నేపథ్యంలో ఫైర్‌ సేఫ్టీ డీజీ వై.నాగిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల అగ్నిమాపకశాఖ అధికారులతో ఈ నెల 15న జరిగిన సమావేశం అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించారు. ఆ వివరాలను సీఎస్‌ శాంతికుమారితో శుక్రవారం వివరించారు. ఆ వివరాలు

* అగ్నిమాపక శాఖలోని శకటాలు, ఫైర్‌ పంప్‌లు, రక్షణ సామగ్రి సహా పరికరాలన్నింటినీ సిద్ధం చేసి ఉంచుకోవడం.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌రూంకు సమాచారం అందించి డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సహకారం తీసుకోవడం. అగ్నిమాపక శకటాలను జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తుండటంతో ఘటనాస్థలాలకు వీలైనంత తొందరగా చేరుకోవడంపై దృష్టి సారించడం. ప్రమాదస్థలికి త్వరగా వెళ్లేందుకు గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు కోసం ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకోవడం.

* కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆసుపత్రులు, పాఠశాలలు, సినిమాహాళ్లు, పరిశ్రమలు, వాణిజ్య భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించడంతో పాటు ప్రమాద సమయాల్లో వ్యవహరించాల్సిన తీరుపై నిర్వాహకులకు మూడు నెలలకోసారి ఫైర్‌ డ్రిల్‌ ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని