డాక్టరు, టీచర్లలో అమ్మాయిలదే ఆధిపత్యం!

మనదేశంలో ప్రాథమిక పాఠశాల్లో పాఠాలు బోధిస్తున్న ప్రతి వంద మంది పురుష టీచర్లతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయులు 126 మంది ఉన్నారు.

Updated : 25 Mar 2023 11:42 IST

పీజీ డిగ్రీ కోర్సుల్లోనూ వారే ముందంజ..
ఇంజినీరింగ్‌, ఐటీ డిగ్రీలలో అబ్బాయిల హవా
కేంద్ర గణాంక శాఖ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మనదేశంలో ప్రాథమిక పాఠశాల్లో పాఠాలు బోధిస్తున్న ప్రతి వంద మంది పురుష టీచర్లతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయులు 126 మంది ఉన్నారు. వైద్యం, సైన్స్‌ డిగ్రీ కోర్సుల్లోనూ అతివలు దూసుకెళుతున్నారు. మరోవైపు ఐటీ, ఇంజినీరింగ్‌ డిగ్రీల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిలకన్నా తక్కువగా ఉంటోంది. 2020-21లో మొత్తం 45.80 లక్షల మంది పీజీ డిగ్రీ కోర్సుల్లో చేరగా వీరిలో అమ్మాయిలే 25.83 లక్షల మంది ఉన్నారు. అబ్బాయిలు ఎక్కువ శాతం డిగ్రీతో చదువు ఆపేస్తుంటే అమ్మాయిలు ఎక్కువగా పీజీలో చేరుతున్నారు. పీహెచ్‌డీల విషయంలో మాత్రం అబ్బాయిలే ముందుంటున్నారని కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ అధ్యయనంలో తేలింది. ‘భారతదేశంలో పురుషులు-మహిళలు-2022’ పేరుతో ఈ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక అనేక రంగాల్లో అమ్మాయిలు, అబ్బాయిల పురోగతిని వివరించింది. దేశంలో చదువుతో సంబంధం లేకుండా 82 శాతం మంది మహిళలు ఎలాంటి ఆదాయం ఇవ్వని ఇంటి పనులు రోజుకు 5 గంటలపైనే చేస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. 60 ఏళ్లు దాటాకే పురుషులు ఇంటి పనుల్లో సాయపడుతున్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలు...

* దేశంలో 2020-21 నాటికి 25 ఏళ్లకుపైగా వయసు గల పురుషుల్లో కనీసం సెకండరీ స్థాయి విద్యనభ్యసించినవారు 60 శాతం ఉన్నారు.

* 2020-21లో దేశవ్యాప్తంగా వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారి సంఖ్యను పరిశీలిస్తే ఆకర్షణీయమైన జీతాలు లభించే ఐటీ, కంప్యూటర్‌ డిగ్రీ కోర్సుల్లో 5.33 లక్షల మంది అబ్బాయిలుంటే 3.44 లక్షల మందే అమ్మాయిలున్నారు.

* డాక్టర్లుగా డిగ్రీ పట్టాలు పుచ్చుకునే ఎంబీబీఎస్‌, ఎండీ, ఆయుర్వేద, హోమియో డిగ్రీల్లో చేరే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం వైద్య కోర్సుల్లో 6.32 లక్షల మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు 8.94 లక్షల మంది ఉండటం గమనార్హం.

* మేనేజ్‌మెంట్‌ డిగ్రీలో 5.16 లక్షల మంది అబ్బాయిలుండగా.. 2.98 లక్షల మంది అమ్మాయిలున్నారు.

* న్యాయవిద్యలో 3.16 లక్షల అబ్బాయిలు, 1.61 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు.  

* విదేశీ భాషలను అభ్యసించే డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలే 18 వేల మంది ఎక్కువగా ఉన్నారు.

* వ్యాయామ విద్యా డిగ్రీ కాలేజీల్లో 44,907 మంది బాలురుండగా.. 19,190 మంది మాత్రమే అమ్మాయిలున్నారు.

* జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది.


అక్షరాస్యత, ఇంటర్‌నెట్‌..

* రోజూ ఇంటర్‌నెట్‌ వినియోగిస్తున్న వారు 2017-18లో దేశవ్యాప్తంగా 17.6 శాతం మంది ఉన్నారు.

ఈ విభాగంలో తెలంగాణ 22.2 శాతంతో జాతీయ సగటు 17.6 కన్నా ముందుంటే ఏపీ 14.8 శాతంతో వెనుకబడి ఉంది.

* దేశవ్యాప్తంగా 2017-18లో 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసువారిలో అక్షరాతస్యత దామన్‌ దీవ్‌, గోవా, లక్షదీవుల్లో 100 శాతముంటే పుదుచ్చేరిలో 99.98, కేరళలో 99.71 శాతముంది. జాతీయ సగటు 94.31 కాగా తెలంగాణలో 96.88, ఏపీలో 92.81 శాతమున్నట్లు తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని