సంక్షిప్త వార్తలు(4)

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం నిర్వహించిన పోలీస్‌ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

Updated : 27 Mar 2023 04:07 IST

పోలీస్‌ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతం

 60.92 శాతం మంది అభ్యర్థుల హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం నిర్వహించిన పోలీస్‌ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పరీక్షలో మొత్తం 975 మంది అభ్యర్థులకు 594 మంది(60.92శాతం) హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌, డిజిటల్‌ వేలిముద్రల్ని సేకరించారు. పరీక్ష ప్రాథమిక కీని త్వరలోనే మండలి వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.


మిషన్‌ కాకతీయతో పెరిగిన భూగర్భ జలాలు: వినోద్‌

ఈనాడు, హైదరాబాద్‌: నీరే భవిష్యత్తుకు జీవనాధారమని, కురిసే ప్రతినీటి బొట్టునూ ఒడిసిపట్టుకుని పొదుపుగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం, గాంధీజ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో నీటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ చేపట్టిన జనచైతన్య ప్రచారయాత్రను ఆయన హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సు, తెలుగు రాష్ట్రాల స్థాయి కవిత్వ ఉత్సవంలో వినోద్‌కుమార్‌ మాట్లాడారు. నీటివిలువ తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ ద్వారా దాదాపు 44 వేల చెరువుల్లోని పూడికలు తీయించారని, దీనిద్వారా భూగర్భజలాలు  పెరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగాయన్నారు. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థల ప్రచురణలను వినోద్‌కుమార్‌ ఆవిష్కరించి కవులను సన్మానించారు. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ సంస్థలఛైర్మన్‌ డాక్టర్‌ జి.రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ యానాల ప్రభాకర్‌రెడ్డి, జలమండలి ఓఎస్డీ జాల సత్యనారాయణ, తెలుగు రాష్ట్రాల కవులు పాల్గొన్నారు.


‘తెలంగాణ రాజ్య సమితి’ పార్టీ ఏర్పాటుకు దరఖాస్తు

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు, భారాస నేత తుపాకుల బాలరంగం ‘తెలంగాణ రాజ్య సమితి’ పేరిట కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల గ్రామానికి చెందిన బాలరంగం.. దిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 12న దరఖాస్తు సమర్పించారు. అనంతరం ఆదివారం స్వగ్రామానికి వచ్చిన బాలరంగంను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా భారాసతోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కారానికి నోచుకోని సందర్భాల్లోనే ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ తరఫున ముందుకు సాగుతానని వెల్లడించారు.


ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు ఇవ్వాలి

ఈనాడు, హైదరాబాద్‌: డిస్కంలు అదనంగా ఖర్చుపెట్టిన రూ.12,718 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకుండా తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని, కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన టీఎస్‌ఆర్టీసీకి కూడా రూ.4 వేల కోట్ల గ్రాంటు ఇవ్వాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు కోరారు. పాత బస్సుల స్థానంలో కొత్తవాటి కొనుగోలు, వేతన సవరణకు సహాయపడాలని కోరారు. టీఎస్‌ఆర్టీసీలో 2017, 2021కి సంబంధించి వేతన సవరణ చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని