MLC kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

Updated : 27 Mar 2023 08:49 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌రామచంద్రపిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారన్నది ఈడీ అభియోగం. దీనిపై ఈ నెల 11న కవితను తొలిసారి విచారించిన ఈడీ.. 16న మరోసారి హాజరుకావాలని సమన్లు జారీచేసింది. చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు ఈకేసు విచారణకు రాలేదు. 27 నాటికి జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌చేశారు. దీనిపై ఇప్పటికే ఈడీ కెవియట్‌ దాఖలు చేసింది. ఈ రెండు అంశాలూ సోమవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు