గడువు కంటే ముందే ఉపాధి హామీ లక్ష్యాన్ని చేరిన తెలంగాణ

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు పనులు, సామగ్రి వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తెలంగాణ చేరుకుంది.

Updated : 30 Mar 2023 06:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు పనులు, సామగ్రి వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తెలంగాణ చేరుకుంది. గడువుకు మూడురోజుల ముందే.. మంగళవారం నాటికి పనులు, నిధుల వినియోగాన్ని వంద శాతం ఆన్‌లైన్‌లో నమోదు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1,937.28 కోట్లను కూలీలకు వేతన వ్యయంగా, రూ.1,290.57 కోట్లను సామగ్రి(మెటీరియల్‌) వ్యయంగా కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనులను చేపట్టి కూలీలకు 11 కోట్ల పని దినాలు కల్పించింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. ఈ సారి పనులను జిల్లా యూనిట్‌గా చేపట్టినందున పనుల నిర్వహణ, వేతనాల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధుల బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని మంగళవారం వరకు అధికారులు పూర్తి చేశారు. ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుండగా.. 28నే నమోదును పూర్తి చేయడంపై కేంద్ర అధికారులు తెలంగాణప్రభుత్వాన్ని ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని