గేదెల కొనుగోలులో గందరగోళం

రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తున్న పాడి గేదెల కొనుగోలు వ్యవహారంలో అధికారులు, లబ్ధిదారుల మధ్య సమన్వయం కొరవడటం గందరగోళానికి దారి తీసింది.

Published : 30 Mar 2023 05:26 IST

హరియాణాలో చిక్కుకుపోయిన 52 మంది లబ్ధిదారులు
24 గంటలుగా ఆందోళన

ఈనాడు, వరంగల్‌, నల్లబెల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తున్న పాడి గేదెల కొనుగోలు వ్యవహారంలో అధికారులు, లబ్ధిదారుల మధ్య సమన్వయం కొరవడటం గందరగోళానికి దారి తీసింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోని నల్లబెల్లి, నెక్కొండ, ఆత్మకూరు, ధర్మసాగర్‌ మండలాలకు చెందిన 106 మంది దళిత రైతులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల విలువ చేసే నాలుగు పాడి గేదెలు మంజూరయ్యాయి. తొలి విడతగా రెండు గేదెలను కొనుగోలు చేయడానికి హరియాణాకు ఈనెల 26న రైలులో బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం అధికారుల వెంట 54 మంది లబ్ధిదారులు ఉండగా వారు గేదెలను కొనుగోలు చేశారు. మిగతా 52 మంది లబ్ధిదారులు కనిపించకుండా పోవడం కలకలం సృష్టిస్తోంది. వీరు మధ్య దళారుల మాటలు నమ్మి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో తమకు విషయం చెప్పకుండా రైలు దిగిపోయారని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమను అధికారులు పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపిస్తూ, తమ పరిస్థితి గందరగోళంగా మారిందని ఆ 52 మంది సామాజిక మాధ్యమాల ద్వారా వరంగల్‌, హనుమకొండ ప్రజాప్రతినిధులకు బుధవారం సమాచారం అందించారు. తాము హరియాణాలోనే ఉన్నామని తెలిపారు. ఓ డెయిరీ ఫామ్‌లో గత 24 గంటలుగా వారు ఆందోళన  చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని