Nizamabad: ‘ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు’.. ఇందూరులో ఫ్లెక్సీల కలకలం

‘పసుపు బోర్డు’ ఏర్పాటుపై నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి.

Updated : 01 Apr 2023 09:55 IST

జిల్లాలోని ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు
తామూ ప్రశ్నిస్తామని ఎంపీ అర్వింద్‌ వెల్లడి

ఈటీవీ- నిజామాబాద్‌, న్యూస్‌టుడే- నిజామాబాద్‌ నగరం: ‘పసుపు బోర్డు’ ఏర్పాటుపై నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నిజామాబాద్‌లోని ప్రధాన చౌరస్తాలతో పాటు డిచ్‌పల్లి, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోనూ పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు’... అంటూ ఫ్లెక్సీల్లో రాశారు. రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. పసుపు బోర్డు తీసుకొస్తానని గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫ్లెక్సీల అంశంపై అర్వింద్‌ స్పందించి ఒక వీడియో విడుదల చేశారు. ‘గతంలో భారాస ఎంపీలు లోక్‌సభలో ఓ ప్రశ్న అడిగారు. మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో ధనియాలకు స్పైస్‌ బోర్డు పెట్టారా? మిర్చి కోసం ఏపీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో 3 స్పైస్‌ బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా? నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు ప్రతిపాదన ఉందా? అని ప్రశ్నించారు. ఈ పంటలన్నీ స్పైస్‌బోర్డు కిందకు వస్తాయని కేంద్రం సమాధానమిచ్చింది. ప్రత్యేకంగా పసుపు పంట కోసం నిజామాబాద్‌లో స్సైస్‌బోర్డుపెట్టి రూ.30కోట్లు ఇచ్చినట్లు ఆ జవాబు ద్వారా వెల్లడైంది. పసుపుధర పడిపోయిందని..ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రప్రభుత్వం లేఖ రాయడం లేదు. భారాస హామీలైన.. రెండు పడక గదుల ఇళ్లు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై మేం కూడా ప్రశ్నిస్తాం’ అని అర్వింద్‌ ఆ వీడియోలో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని