Private Schools Fee: ఫీజుల ‘మోత’

ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని డీడీ కాలనీలో ఉన్న ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి 8వ తరగతి ఫీజు రూ.80 వేలు.

Updated : 02 Apr 2023 07:58 IST

ప్రైవేటు బడుల్లో రుసుములు పైపైకి..
కొన్ని పాఠశాలల్లో 25 శాతం, కార్పొరేట్‌ స్కూళ్లలో 50 శాతం వరకూ పెంపు
నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఫలితం శూన్యం
బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు
ఈనాడు - హైదరాబాద్‌

* ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని డీడీ కాలనీలో ఉన్న ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి 8వ తరగతి ఫీజు రూ.80 వేలు. వచ్చే ఏడాది 9వ తరగతి చదివేందుకు రూ.1.20 లక్షలు చెల్లించాలని పాఠశాల ప్రతినిధులు సమాచారం పంపారు. అంటే పైతరగతికి 50 శాతం పెంచేశారన్నమాట.


* కోకాపేటలోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ సంవత్సరం 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. వచ్చే ఏడాది అయిదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలనే సందేశం తల్లిదండ్రులకు వెళ్లింది. అంటే పైతరగతికి అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది.


* ఉప్పల్‌ చౌరస్తా సమీపంలోని ఓ ప్రముఖ పాఠశాల అది. చాలా పాఠశాలలతో పోల్చుకుంటే అక్కడ కొంత రుసుములు తక్కువన్న పేరుంది. అయినా ఈసారి ఒకటో తరగతిలో ప్రవేశానికి 14 శాతం పెంచడం గమనార్హం. అక్కడ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించగా.. వచ్చే ఏడాదికి దాన్ని రూ.57 వేలకు పెంచారు. 4వ తరగతి ఫీజు రూ.49,500  ఉండగా.. 5వ తరగతిలో దీని కన్నా దాదాపు 18 శాతం అదనంగా రూ.58,400 చెల్లించాలి.


* కూకట్‌పల్లిలోని రెండో శ్రేణి కార్పొరేట్‌ పాఠశాలలో 6వ తరగతి రుసుం రూ.48 వేలు ఉండగా.. వచ్చే ఏడాదికి రూ.58 వేలకు (20 శాతానికి పైగా) పెంచారు.


ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్‌ బడులు.. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి(2023-24) కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి ఆదేశాలేవీ లేకపోవడంతో పలు పాఠశాలలు 2022-23 విద్యాసంవత్సరంలో భారీగా పెంచాయి. వచ్చే ఏడాదీ మరోసారి మోత మోగించనున్నాయి. ఇప్పటికే చాలా బడులు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా.. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి. దీనిపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తామూ సిబ్బంది వేతనాలను పెంచాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. అయితే సిబ్బందికి అరకొర పెంచి.. మిగిలిన మొత్తాన్ని జేబుల్లో వేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.

నియంత్రణ చట్టం ఏదీ?

పాఠశాలల రుసుముల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. పాత ఫీజు కంటే ఏటా 10 శాతానికి మించి పెంచకూడదని, మరికొన్ని సిఫారసులను అమలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆ కమిటీ పంపింది. వీటిపై చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. గత ఏడాది కాలంగా ఆ ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనందువల్ల ఆర్డినెన్స్‌ జారీ చేయవచ్చు. ఆ దిశగా కూడా చర్యలు లేవు. వచ్చే ఏడాది ఫీజులు తడిసిమోపెడు కానుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశాం

-వెంకట్‌, సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌

మేము దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు అడిగితేనే చట్టం తీసుకువస్తామని మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. అయినా చర్యలు లేకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశాం. దాంతో ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఫీజుల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ 2017 డిసెంబరులో నివేదిక సమర్పించింది. అయిదేళ్లు దాటినా ఇప్పటికీ కమిటీ సిఫారసులను పరిశీలిస్తున్నామని సర్కారు చెబుతోంది. ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితో ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని