8, 9 తేదీల్లో ఎస్సై తుది పరీక్ష

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో ఎస్సై, ఏఎస్సై తత్సమాన ఉద్యోగాల తుది పరీక్ష 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.

Updated : 02 Apr 2023 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో ఎస్సై, ఏఎస్సై తత్సమాన ఉద్యోగాల తుది పరీక్ష 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు శనివారం విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఎస్సై (సివిల్‌) అభ్యర్థులు రెండు రోజుల్లో నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఐటీ, పీటీవో, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోలో ఏఎస్సై అభ్యర్థులు రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. తుది పరీక్ష రాసే అభ్యర్థులంతా ఈనెల 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు www.tslprb.in  వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏదైనా కారణంతో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ కాని పక్షంలో support@tslprb.in కు మెయిల్‌ చేయాలని, 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని నియామక మండలి ఛైర్మన్‌ తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత దాన్ని ఏ4 సైజ్‌ కాగితంపై ప్రింట్‌ తీసుకొని, నిర్ణీత ప్రాంతంలో పాస్‌పోర్ట్‌ ఫొటో అంటించాలని చెప్పారు. ఫొటో గుర్తింపులేని వారిని అనుమతించబోమన్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలను తుది ఎంపికకు పరిగణించకున్నా... వీటిలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుందని ఛైర్మన్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లలో నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని