అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంగా భారత్‌

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంగా భారతదేశం మారుతుందని తాను బలంగా నమ్ముతున్నట్లు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు.

Updated : 02 Apr 2023 05:04 IST

ఇండియా, ఘనా వాణిజ్య సదస్సులో విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంగా భారతదేశం మారుతుందని తాను బలంగా నమ్ముతున్నట్లు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఇండియా, ఘనా వాణిజ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాణిజ్య వివాదాలను పరిష్కరించేందుకు స్థిరమైన, సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం... పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కీలకమని స్పష్టంచేశారు. భారతదేశంలో ఆర్బిట్రేషన్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాలను అభివృద్ధి చేసేందుకు శాసన, న్యాయ, కార్వనిర్వాహక వ్యవస్థలు అంకితభావంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తాను సీజేఐగా పనిచేసినప్పుడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్‌, మధ్యవర్తిత్వ (మీడియేషన్‌) కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన ప్రతిపాదనను మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెల వ్యవధిలోనే ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేయించారని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ఆరునెలల వ్యవధిలోనే హైదరాబాద్‌లో ఈ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేసేలా కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఘనాతో స్నేహపూర్వక బంధం...

భారత్‌, ఘనా దేశాల మధ్య సుదీర్ఘకాలం నుంచి స్నేహపూర్వక సంబంధాలున్నాయని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దం తరవాత 1957లో ఘనాకు కూడా బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వేచ్ఛ లభించిందని ఆయన గుర్తుచేశారు. గాంధీ చూపిన అహింసా మార్గంలోనే డాక్టర్‌ క్వామె ఎన్‌క్రుమా నేతృత్వంలో ఘనా స్వాతంత్య్రపోరాటం జరిగిందని రమణ తెలిపారు. ప్రస్తుతం ఘనాలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో భారత్‌ 3వ స్థానంలో ఉందన్నారు. ఘనాలో విదేశీ ప్రాజెక్టుల సంఖ్యాపరంగా భారత్‌ రెండో స్థానంలో ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ వల్ల వాణిజ్యాన్ని ప్రోత్సహించి పెట్టుబడులు రాబట్టవచ్చని, దీనివల్ల దేశాల మధ్య వ్యాపార కార్యకలాపాల్లో అస్థిరత, నష్టాల ముప్పు తగ్గుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని