TSRTC: ఊరికో బస్ ఆఫీసర్.. ఆర్టీసీ వినూత్న ప్రయత్నం
సంస్థను ప్రజలకు మరింత చేరువ చేసి, ఆదాయం పెంచుకునేందుకు గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ఈనాడు, హైదరాబాద్: సంస్థను ప్రజలకు మరింత చేరువ చేసి, ఆదాయం పెంచుకునేందుకు గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండగా రెండు వేలకు పైగా గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామాల్లో నివసించే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లుగా నియమిస్తారు. అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం జారీ చేశారు. ఈ కొత్త వ్యవస్థ మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో వార్డుకో బస్ ఆఫీసర్ను డిపో మేనేజర్లు నియమిస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు..చిన్నవైతే రెండు, మూడింటికి ఒకరిని నియమిస్తారు. విలేజ్ బస్ ఆఫీసర్లు 15 రోజులకు ఒకసారి ప్రజలతో సమావేశం అవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు నూతన సర్వీస్లు, సమస్యలు వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి అధికారులకు చేరవేస్తారు.
గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాల్ని సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే బస్ ట్రిప్పులను పెంచుతారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో పాటు ఫంక్షన్ హాల్ నిర్వాహకుల్ని సంప్రదిస్తారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో సంబంధిత విలేజ్ బస్ ఆఫీసర్ పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాల్ని పొందుపరుస్తారు.
ఇప్పటివరకు ఉన్న విధానంలో గ్రామాల్లో బస్సు సర్వీస్లకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే డిపో మేనేజర్లను సంప్రదించాలి. చాలా గ్రామాలకు డిపోలు దూరంగా ఉన్నాయి. శుభకార్యాలకు అద్దె బస్సులను బుక్ చేసుకోవాలన్నా పట్టణం వరకు వెళ్లాల్సి వచ్చేది. విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థతో ఇక ఆ వ్యయప్రయాసలు ఉండవు. ప్రజలకు, టీఎస్ఆర్టీసీకి అనుసంధానంగా వీళ్లు పనిచేస్తారు. విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను వినియోగించుకుని సంస్థను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
మేడే కానుకగా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలి
వేతన సవరణ చేసి టీఎస్ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేకూర్చాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రూ.నాలుగు లక్షల కోట్లకుపైగా అప్పులున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో ఉద్యోగులకు వేతనాల్ని పెంచింది. 2002 మార్చి నాటికి రూ.50 వేల కోట్ల నష్టాలు, రూ.24 వేల కోట్ల అప్పుల్లో ఉన్న డిస్కంలకు 35 శాతం ఫిట్మెంట్తో 2018 నుంచి వేతనాలు పెంచారు. రూ.6 వేల కోట్ల అప్పులు, రూ.10 వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సమన్యాయం చేయాలి. మే డే కానుకగా టీఎస్ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ అమలుచేయాలి’ అని ఓ ప్రకటనలో కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే