TS Inter: ఇంటర్‌లోనూ గ్రేడ్లు ఇద్దామా?

పదో తరగతి తరహాలోనే ఇంటర్‌లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని సర్కార్‌ యోచిస్తోంది.

Updated : 11 May 2023 09:27 IST

సాధ్యాసాధ్యాలపై కమిటీని నియమించే యోచనలో సర్కార్‌

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి తరహాలోనే ఇంటర్‌లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని సర్కార్‌ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్‌, నీట్‌ ర్యాంకుల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్‌కూ శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్‌లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? తదితర పలు అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తోంది. దీనిపై ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదని చెప్పారు. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం  ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోస్త్‌ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్‌ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ‘ఇప్పుడు ఇంటర్‌ మార్కుల కంటే జేఈఈ, నీట్‌ ర్యాంకులు వస్తాయో?రావో? అన్న దానిపైనే అధికంగా ఒత్తిడి ఉంది’ అని నానో అకాడమీ సంచాలకుడు కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు.

‘పది’లోనూ ఆన్‌లైన్‌ మూల్యాంకనం!

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో కూడా ఆన్‌లైన్‌ విధానాన్ని (ఆన్‌ స్క్రీన్‌ ఎవాల్యుయేషన్‌) అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఆలోచన చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు.  అదనపు జవాబుపత్రాలు తీసుకుంటే ఇంటర్‌ తరహాలో బుక్‌లెట్‌గా ఇవ్వాలని, ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలంటే అది తప్పనిసరని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని