హైదరాబాద్‌లో అయిదు వేల ఏళ్ల నాటి బొమ్మల లిపి

హైదరాబాద్‌లో అయిదు వేల ఏళ్ల క్రితం నాటి బొమ్మలలిపి బయటపడింది. నూతన శిలాయుగంలో ఆదిమానవులు నివసించారనడానికి ఆధారాలు వెలుగుచూశాయి.

Published : 22 May 2023 03:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అయిదు వేల ఏళ్ల క్రితం నాటి బొమ్మలలిపి బయటపడింది. నూతన శిలాయుగంలో ఆదిమానవులు నివసించారనడానికి ఆధారాలు వెలుగుచూశాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బీఎన్నార్‌ హిల్స్‌లో ప్రాంగణ రాయి పైకప్పుపై బొమ్మల లిపి అక్షరాలు ఉన్నాయని రాష్ట్ర గిరిజన మ్యూజియాల సంరక్షకుడు, చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు. ‘ఇవి సింధు నాగరికత నాటి అక్షరాలతో పోలి ఉన్నాయి. పడగ రాయి పైకప్పునకు రెండుగజాల పొడవున తూర్పు- పడమరలుగా గొలుసుకట్టు బొమ్మలరాత ఎరుపు రంగులో లభించింది. ఈ తరహా రాతలు ఇప్పటికే మహబూబ్‌నగర్‌ దగ్గర్లోని మన్నెంకొండ, వర్గల్‌ సరస్వతీ ఆలయ పరిసరాల్లో పడగరాళ్ల పైకప్పులపై కనిపించాయి. అయితే ఇవి చరిత్రకారులు, నిపుణులు చదివే వీల్లేని పరిస్థితుల్లో ఉండగా బీఎన్నార్‌హిల్స్‌లోనివి చదివేలా కనిపిస్తున్నాయి. తుంగభద్ర నదీలోయ గుహచిత్రలేఖనాలు, ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా విక్రమ్‌ఖోల్‌ రాతి చిత్రలేఖనాల్లోనూ బొమ్మలలిపిని గతంలో నిపుణులు గుర్తించి, అవి అశోకుడికి పూర్వం వెయ్యి ఏళ్ల నాటివిగా అంచనా వేశారు. తాజాగా బీఎన్నార్‌హిల్స్‌లోని అక్షరాలు సింధు నాగరికత అక్షరాలతో పోలి ఉన్నాయి. నిపుణులు వాటిని చదివి నిర్ధారిస్తే నాటి సంస్కృతి ఇక్కడా ఉన్నట్లు వెల్లడవుతుంది’ అని ఆయన వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని