ఒక్కో రోజు.. ఒక్కో ప్రత్యేకత
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకూ 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
21 రోజులపాటు వాడవాడలా వేడుకలు
దశాబ్ది ఉత్సవ షెడ్యూలు ఖరారు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకూ 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూలును ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉండేలా రూపొందించారు.
కార్యక్రమాల షెడ్యూలు ఇదీ..
జూన్ 2: దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలుంటాయి.
జూన్ 3: ‘తెలంగాణ రైతు దినోత్సవం’గా జరుపుతారు. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.
జూన్ 4: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్థ సేవలను వివరించేలా రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో కార్యక్రమాలుంటాయి.
జూన్ 5: ‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశముంటుంది. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదే రోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.
జూన్ 6: ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ జరుగుతుంది. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.
జూన్ 7: ‘సాగునీటి దినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేస్తారు. రవీంద్రభారతిలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రి హాజరవుతారు.
జూన్ 8: ‘ఊరూరా చెరువుల పండగ’ చేస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుపై ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులు, చెరువు కట్టలపై సభలు ఘనంగా నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టపై సహపంక్తి భోజనాలు చేస్తారు.
జూన్ 9: ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు నిర్వహిస్తారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును వివరిస్తూ రవీంద్రభారతిలో సభ ఉంటుంది.
జూన్ 10: ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు చేపట్టడం వల్ల ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం, తద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను చేపడతారు.
జూన్ 11: ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’ జరుపుతారు. జిల్లా స్థాయుల్లో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం, సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తారు.
జూన్ 12: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రన్’ నిర్వహిస్తారు.
జూన్ 13: ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’ చేపడతారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.
జూన్ 14: ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించి సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల వల్ల ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని వివరిస్తారు. నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు.
జూన్ 15: ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’ జరుపుతారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపేలా పలు కార్యక్రమాలుంటాయి. పురస్కారాలు సాధించిన ఉత్తమ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.
జూన్ 16: ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణం సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.
జూన్ 17: ‘తెలంగాణ గిరిజనోత్సవం’ జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తారు.
జూన్ 18: ‘తెలంగాణ మంచి నీళ్ల పండగ’ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి, ఉచితంగా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలుంటాయి.
జూన్ 19: ‘తెలంగాణ హరితోత్సవం’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.
జూన్ 20: ‘తెలంగాణ విద్యాదినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యాసంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదే రోజు ‘మన ఊరు- మన బడి’ కింద సిద్ధం చేసిన పాఠశాలలను, 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభిస్తారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.
జూన్ 21: ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలుంటాయి.
జూన్ 22: ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి పల్లెలో, పట్టణాల్లో, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. వారి త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాద్లో ట్యాంక్బండ్పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. రాజధానిలో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు.
ఇంటింటా తోరణాలు.. ఊరూరా వనభోజనాలు
గ్రామాల్లో దశాబ్ది సంబురాలకు ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున సంబురాలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2న ప్రారంభమయ్యే ఉత్సవాల్లో పండగ వాతావరణం చాటేలా ఇంటింటా రంగవల్లులు, మామిడి తోరణాలు, ఊరూరా వనభోజనాలు వంటివి చేపట్టాలని సూచించింది. కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అధికారులు తీసుకోవాలని సూచించింది. ‘‘ఉత్సవాల ప్రారంభం నుంచీ ఇంటింటా ముగ్గులు వేయాలి. అరటి, కొబ్బరి మండపాలను సిద్ధం చేయాలి. గ్రామ పంచాయతీలను అలంకరించాలి. ప్రతి ఊరిలో ప్రగతి నివేదికలను తయారు చేయాలి. తెలంగాణ చిత్రపటం నమూనాలో మానవహారం నిర్వహించాలి. మూడు ఉత్తమ మహిళా సంఘాలను గుర్తించి సత్కరించాలి. రైతులకు అయిదు కిలోల వర్మి కంపోస్టు ఎరువుల సంచులను అందజేయాలి’’ అని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
లోక్సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!
-
Movies News
Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
Ts-top-news News
Sangareddy: గడ్డపోతారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం