సివిల్స్‌లో తెలుగోళ్ల సత్తా

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన పవన్‌దత్త మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 22వ ర్యాంకు సాధించారు.

Updated : 24 May 2023 05:15 IST

వ్యవస్థలో మార్పు తీసుకొస్తా
పవన్‌దత్త, 22వ ర్యాంక్‌, తిరుపతి

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన పవన్‌దత్త మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 22వ ర్యాంకు సాధించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి సివిల్స్‌ వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. తండ్రి వెంకటేశ్వర్లు ఎల్‌ఐసీ ఉద్యోగి అని, అమ్మ లలితాకుమారి ఉపాధ్యాయురాలని వివరించారు. అమ్మ ప్రేరణతో సివిల్స్‌కు సిద్ధమైనట్లు తెలిపారు. అన్నమాచార్య కీర్తనలు ఆలపించడం, వయోలిన్‌ వాయించడమంటే ఇష్టమని పేర్కొన్నారు.  


ఎక్కువ సాధన చేయడం కలిసొచ్చింది

- తరుణ్‌ పట్నాయక్‌, 33వ ర్యాంకు, రాజమహేంద్రవరం

తరుణ్‌ పట్నాయక్‌ గతేడాది(2021) సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించి సిమ్లాలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌లో శిక్షణ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే రెండో ప్రయత్నంలో 33వ ర్యాంకు సాధించారు. తరుణ్‌ పట్నాయక్‌ తండ్రి ఎంఆర్‌కే పట్నాయక్‌ ఎల్‌ఐసీలో పనిచేస్తుండగా... తల్లి వైజాగ్‌ ఫుడ్స్‌ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఒక ఏడాది కాలంలో ఎలా చదవాలో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్లినట్లు తరుణ్‌ తెలిపారు. మొత్తం సిలబస్‌ను నెల, వారం, రోజు, గంటలో ఏమేమీ చదవాలో కాలపట్టిక రచించుకుని పూర్తిచేయడం... దానికన్నా ఎక్కువగా సాధన చేయడం కలిసొచ్చాయని పేర్కొన్నారు.


పేదలకు సేవచేస్తా..

- శాఖమూరి ఆశ్రిత్‌, 40వ ర్యాంక్‌, హనుమకొండ

పేదలకు సేవచేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమైనట్లు శాఖమూరి ఆశ్రిత్‌ తెలిపారు. ఇంటర్‌ వరకూ ఉమ్మడి వరంగల్‌లో చదివిన ఆశ్రిత్‌.. రాజస్థాన్‌లోని బిట్స్‌ పిలానిలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. హైదరాబాద్‌లో ఓ కోచింగ్‌ కేంద్రంలో ఏడాదిపాటు శిక్షణ పొంది తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించారు. ఆశ్రిత్‌ తండ్రి అమర్‌ వరంగల్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. తల్లి పద్మజ గృహిణి. వీరిది జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామం కాగా.. హనుమకొండలో స్థిరపడ్డారు.


ఐఆర్‌ఎస్‌ నుంచి ఐఏఎస్‌కు..

- రిచా కులకర్ణి, 54వ ర్యాంకు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ సీబీఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన రిచా.. 2021లో సివిల్స్‌ రాసి 131 ర్యాంకు సాధించారు. దీంతో ఐఆర్‌ఎస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పట్టుదలతో మళ్లీ ప్రయత్నించి 54 ర్యాంకుతో సత్తా చాటి ఐఏఎస్‌ సాధించారు.


ఎక్కువ మందికి సేవ చేయాలనేది లక్ష్యం

- ఎం.సాయి ప్రణవ్‌, 60వ ర్యాంక్‌, గుంటూరు

మూడుసార్లు మెయిన్స్‌ వద్దే ఆగిపోయినా.. పట్టువదలకుండా నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమ ర్యాంకు సాధించినట్లు గుంటూరులోని శ్యామలానగర్‌కు చెందిన ఎం.సాయి ప్రణవ్‌ తెలిపారు. తల్లిదండ్రులు ఉమ, అమర్‌నాథ్‌ విశ్రాంత బ్యాంకు అధికారులు. ‘సివిల్స్‌ కల సాకారం కావటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఎక్కువ మందికి సేవ చేయాలనేది లక్ష్యం. జనరల్‌ నాలెడ్జి, వర్తమాన వ్యవహారాల కోసం ఎక్కువగా తెలుగు, ఆంగ్ల దినపత్రికలను ఫాలో అయ్యేవాడ్ని. స్వయంశక్తితో హోటల్‌ నిర్వాహకుడిగా ఎదిగిన మా తాతయ్య నాకు స్ఫూర్తి’ అని సాయి ప్రణవ్‌ తెలిపారు.


నాన్న, అక్కల స్ఫూర్తితో...

- ఉత్కర్ష్‌కుమార్‌, 78వ ర్యాంక్‌, హైదరాబాద్‌

తండ్రి, ఇద్దరు అక్కలు తనకు స్ఫూర్తిగా నిలిచారని, సమాజానికి తనవంతు సేవ చేస్తానని ఉత్కర్ష్‌కుమార్‌ తెలిపారు. తల్లిదండ్రులతో హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఉంటున్న ఉత్కర్ష్‌.. ఆరో ప్రయత్నంలో 78వ ర్యాంక్‌ సాధించారు. ఇంటర్‌వరకూ హైదరాబాద్‌లో చదివిన ఉత్కర్ష్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. రెండేళ్ల క్రితం సివిల్స్‌కు ఎంపికైనా.. రక్షణశాఖలో సహాయ సంచాలకునిగా ఉద్యోగం వచ్చినా ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో విధుల్లో చేరలేదు. తండ్రి సునీల్‌కుమార్‌ (ఐఎఫ్‌ఎస్‌) ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా పదవీ విరమణ చేశారు. తల్లి నిషాశ్రీ తెలంగాణ హైకోర్టులో ఉద్యోగి. పెద్ద సోదరి నిషా శ్రీవాత్సవ ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌గా, రెండో సోదరి పరుల్‌ శ్రీవాత్సవ(ఐఆర్‌ఎస్‌) గుజరాత్‌లో కస్టమ్స్‌ విభాగంలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.


బలహీనవర్గాలకు అండగా నిలుస్తా

- అజ్మీరా సంకేత్‌, 35వ ర్యాంక్‌, హైదరాబాద్‌

ఐఏఎస్‌ శిక్షణ పూర్తయ్యాక ఎక్కడ ఉద్యోగం వచ్చినా బలహీనవర్గాలకు అండగా నిలుస్తానని అజ్మీరా సంకేత్‌ ‘ఈనాడు’కు తెలిపారు. సంకేత్‌ తల్లి సవిత బాలానగర్‌లోని ఇస్రోలో ప్రాజెక్ట్‌ అధికారిగా, తండ్రి అజ్మీరా ప్రేమ్‌సింగ్‌ ఉద్యానవనశాఖ ఉపసంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న సంకేత్‌.. దిల్లీ ఐఐటీలో (2013-17) మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బంగారు పతకం సాధించారు. తర్వాత ఒక ఏడాది జపాన్‌లో ఉద్యోగం చేసి దిల్లీకి తిరిగివచ్చారు. తన స్నేహితుడు కట్టా రవితేజ ప్రోత్సాహంతో ఇద్దరూ 2021లో సివిల్స్‌ రాశారు. రవితేజ ఉత్తీర్ణులయ్యారు. తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తాను కూడా ఐఏఎస్‌ అధికారి కావాలన్న పట్టుదలతో ఏడాదిపాటు దిల్లీలోనే ఉండి పరీక్షలు రాసి ఇప్పుడు విజయం సాధించారు.


ఆరో ప్రయత్నంలో ఈ విజయం

- ఆవుల సాయికృష్ణ, 94వ ర్యాంక్‌, కరీంనగర్‌

ఆవుల సాయికృష్ణ ప్రస్తుతం ఇండియన్‌ కార్పొరేషన్‌ లా సిస్టంలో ఏడీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. 2017లో 728వ ర్యాంకు సాధించిన ఆయన.. ఆరో ప్రయత్నంలో 94వ ర్యాంకును అందుకున్నారు. సాయికృష్ణ తండ్రి లక్ష్మయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం పూసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సునీత గృహిణి. తన కుమారుడు సాధించిన ఘనత సంతోషాన్నిస్తోందని లక్ష్మయ్య ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని