ఉష్ణతాపం.. ఉక్కిరి బిక్కిరి

రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇరవై రోజులుగా జిల్లాల్లో 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published : 26 May 2023 03:38 IST

గాలిలో 50 శాతానికి లోపే తేమ

హైదరాబాద్‌ బర్కత్‌పురలో సుందరయ్య పార్కు సమీపంలో ఉన్న చింతచెట్టుపై చనిపోయి వేలాడుతున్న కొంగపిల్ల ఇది. ఎండ వేడికి రోజూ పదుల సంఖ్యలో కొంగలు, వాటి పిల్లలు ఇలా మృత్యువాత పడుతున్నాయి.


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇరవై రోజులుగా జిల్లాల్లో 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడికి ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అవస్థపడుతున్నారు. పక్షులు ఎండకు తాళలేకపోతున్నాయి. గతేడాదితో పోల్చితే చాలా ప్రాంతాల్లో రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో తాపం పెరుగుతోంది.గురువారం చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సమయానికి తగ్గట్లు మంచినీళ్లు తాగని వారు వడదెబ్బకు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలోనే ఎక్కువగా..

కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అధికంగా నమోదవుతున్నాయి. నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిసార్లు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్యాహ్నం వరకు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుండగా సాయంత్రానికి చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

పొడి గాలితో ఎండల తీవ్రత

రాష్ట్రంలో తేమ శాతం 50 శాతం కంటే తక్కువకు పడిపోవడం కూడా అధిక వేడికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొడి గాలి ఎండ తీవ్రతను పెంచుతుందని అంటున్నారు. రాష్ట్రం వైపు వస్తున్న గాలులు పూర్తిగా పొడిగా ఉండటం తేమ శాతం తగ్గడానికి కారణమని చెప్తున్నారు. అయిదు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గురువారం నల్గొండ జిల్లాలో 19 శాతం, రామగుండం 26,  నిజామాబాద్‌ 32, ఖమ్మం 36, హైదరాబాద్‌ 37, హనుమకొండల్లో తేమశాతం 38గా నమోదయింది. ఆదిలాబాద్‌, భద్రాచలం, మెదక్‌లలో 45 శాతానికి పైగా ఉంది.


వడదెబ్బతో ఇద్దరి మృతి

నార్నూర్‌, మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వడదెబ్బతో గురువారం ఇద్దరు మరణించారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూరు  అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రైతు తానాజీ సిశ్లే (65), ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన పణితి కొండయ్య (43) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని