TSPSC paper leak: ఏఈ పరీక్ష టాపర్‌.. ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ తెలియదు

ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ అంటే ఏడో తరగతి చదివే విద్యార్థి సైతం ఠక్కున చేప్పేస్తాడు. కానీ ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి మాత్రం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు.

Updated : 28 May 2023 12:52 IST

చిన్న ప్రశ్నలకూ జవాబు చెప్పలేక తెల్లమొహం
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కొనుగోలు నిందితుల ఎత్తుగడలు 

ఈనాడు, హైదరాబాద్‌: ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ అంటే ఏడో తరగతి చదివే విద్యార్థి సైతం ఠక్కున చేప్పేస్తాడు. కానీ ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి మాత్రం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. కనీస పరిజ్ఞానం లేకపోయినా, గణితం రాకున్నా.. చరిత్ర, రాజనీతి, ఆర్థికశాస్త్రం అంశాలపై పట్టు సాధించకున్నా పోటీ పరీక్షల్లో నెగ్గారు. అడ్డదారిలో కొనుగోలు చేసిన ప్రశ్నపత్రాలతో టాపర్లుగా నిలవడం గమనార్హం. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో ఈ టాపర్ల అసలు రహస్యం వెలుగుచూసింది. గ్రూప్‌1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లను హైదరాబాద్‌ సిట్‌ పోలీసులు వేర్వేరుగా సిట్‌ కార్యాలయానికి పిలిచి విచారణ నిర్వహించారు. వారి నుంచి వచ్చే జవాబుల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిని గుర్తించారు. ఓ యువకుడు ఏఈ పరీక్షలో టాపర్‌. ఏ ప్లస్‌ బీ హోల్‌స్క్వేర్‌ వంటి లెక్కల్లో సులువైన ప్రశ్న అడిగితే తెల్లమొహం వేశాడు. మరో అభ్యర్థి ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు వరుసగా రాసుకొని వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. మార్చి 5న పరీక్ష రాసిన వీరంతా రెండు నెలలకే సమాధానాలు మరచిపోయామంటూ పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.


టీఎస్‌పీఎస్సీ కేసులో విద్యుత్‌శాఖ డీఈ?

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త ముఠా దందా వెలుగుచూసింది. వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ విద్యుత్‌శాఖ డీఈ కనుసన్నల్లో పెద్దఎత్తున అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) ప్రశ్నపత్రాలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఇటీవల అరెస్టయిన విద్యుత్తుశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ రవికిషోర్‌ ద్వారా సుమారు 20 మందికి ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. డీఈ ఉద్యోగం చేస్తూనే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షకుడిగా పని చేసేవారు. అక్కడి అభ్యర్థులతో పరిచయాలు పెంచుకొని దందా నడిపినట్లు నగర సిట్‌ పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మార్చి 5న టీఎస్‌పీఎస్సీ ఏఈ పరీక్ష నిర్వహించగా.. మూడ్రోజులు ముందుగానే ప్రశ్నపత్రాలు చేతులు మారాయి. ఈ కేసులో నిందితులు సురేష్‌, రవికిషోర్‌, దివ్య, విక్రమ్‌ సైదాబాద్‌లోని ఒకే భవన సముదాయంలో నివాసం ఉండేవారు. ఒకరికొకరితో పరిచయాలు, బంధుత్వాలతో ఏఈ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు చేరవేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ రూ.4 లక్షలు చేతులు మారినట్లు సిట్‌ అధికారులు అంచనాకు వచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని