324 కి.మీ. రహదారుల విస్తరణ

రాష్ట్రంలోని కొన్ని రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

Published : 28 May 2023 04:44 IST

జాతీయ రహదారులుగా మార్పు
రూ. 4,058 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
త్వరలో టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొన్ని రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. 431 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల విస్తరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో 324 కిలోమీటర్ల రహదారుల పనులకు కేంద్రప్రభుత్వం రూ. 4,058 కోట్లు మంజూరు చేసింది. వీటిలో సింహభాగం రెండు వరుసలకు విస్తరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగనున్న ఈ పనులకు త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది కాలంగా చేస్తున్న విజ్ఞప్తుల మేరకు కేంద్రం ఈ రహదారులను మంజూరు చేసింది. వీటికి భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. ఇప్పటికే వీటి సవివర నివేదిక (డీపీఆర్‌)లను కేంద్రం ఆమోదించింది. గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రెండేళ్ల వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నది లక్ష్యం. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారి కూడా వీటిలో ఉంది. గౌరెల్లి-వలిగొండ-తొర్రూరు-నెహ్రూనగర్‌- మీదుగా కొత్తగూడెం వెళ్లేందుకు ఇది దగ్గరి దారి అవుతుంది. 35 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. ఆయా రహదారులకు కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారి నంబర్లను కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని