ఆధ్యాత్మిక రాష్ట్రంగా తెలంగాణ

‘నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ, లోక క్షేమం కోసం పాటుపడుతున్న అర్చకులు, వేదపండితులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.

Updated : 28 May 2023 05:04 IST

31న బ్రాహ్మణ సదన్‌ ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ‘నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ, లోక క్షేమం కోసం పాటుపడుతున్న అర్చకులు, వేదపండితులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. బ్రాహ్మణ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గోపనపల్లిలో ప్రభుత్వం కేటాయించిన తొమ్మిది ఎకరాల భూమిలో నిర్మించిన బ్రాహ్మణ సదన్‌ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో పరిషత్‌ ప్రతినిధుల బృందం శనివారం ప్రగతి భవన్‌లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది. ఈ నెల 31వ తేదీన సదన్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రం ఆధ్యాత్మిక తెలంగాణగా మారింది. దేవాలయాల జీర్ణోద్ధరణతో ధార్మిక కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వేదపండితులు ఇక్కడికి ఉపాధి కోసం వస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి బ్రాహ్మణ సదన్‌ లేదు. ఈ కేంద్రం దేశానికి ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా రూపుదిద్దుకోవాలి’ అని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కేవీ రమణాచారి, ఉపాధ్యక్షుడు వనం జ్వాలా నరసింహారావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి, వి.మృత్యుంజయశర్మ, పురాణం సతీష్‌, మరుమాముల వెంకటరమణశర్మ, బోర్పట్ల హనుమంతాచారి, అష్టకాల రామ్మోహన్‌, భద్రకాళి శేషు, సుమలతాశర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాలశర్మ, అధికారులు వి.అనిల్‌కుమార్‌, రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని