అన్ని పండుగల్లా యోగా మహోత్సవం

ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ల మాదిరి యోగా ఉత్సవాన్ని భావితరాలకు ఓ పండుగలా అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Updated : 28 May 2023 05:18 IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపు

బేగంపేట, కంటోన్మెంట్‌ - న్యూస్‌టుడే: ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ల మాదిరి యోగా ఉత్సవాన్ని భావితరాలకు ఓ పండుగలా అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ, మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా ఆధ్వరంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో శనివారం యోగా మహోత్సవ్‌ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యం వహించగా.. ముఖ్యఅతిథిగా గవర్నర్‌ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. కౌంట్‌డౌన్‌ నిర్వహించే అవకాశం హైదరాబాద్‌ నగరానికి దక్కిన ఘనత అని చెప్పారు. ఈ అవకాశమిచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసిన కిషన్‌రెడ్డిని అభినందించారు. ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కలిగించే యోగాను అందరూ ఆచరించాలని గవర్నర్‌ అన్నారు. గృహిణులు రోజులో కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు.

ప్రతి భారతీయుడు గర్వపడే సందర్భం

కేంద్ర ఆయుష్‌ మంత్రి శర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వసుధైక కుటుంబంలా మార్చే శక్తి యోగాకే ఉందన్నారు. మోదీ సమర్థ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని గొప్పగా నిర్వహిస్తుండటం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన అంశమని చెప్పారు. యోగా దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో, దేశంలోని 1.5 లక్షల కేంద్రాల్లో నిర్వహించేందుకు ఆయుష్‌ శాఖ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.

200 దేశాల్లో ఏర్పాట్లు

కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. యోగా దినోత్సవాన్ని 200కు పైగా దేశాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. యోగా మన జీవన విధానం, సంపద, జ్ఞానం అని అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎవరింట్లో వారు కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించాలని, కాలనీలు, బస్తీలు, సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

* మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా డైరెక్టర్‌ డా.ఈశ్వర్‌ వి.బసవరెడ్డి పర్యవేక్షణలో యోగ సాధకులు, యోగాచార్యులు, విద్యార్థులు, సైనిక, భద్రతాదళాల సిబ్బంది యోగాసనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి డా.ముంజపర మహేంద్రభాయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్‌, నైనా జైస్వాల్‌, సినీనటులు విశ్వక్‌సేన్‌, శ్రీలీల, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు