ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న కేసీఆర్‌: స్పీకర్‌ పోచారం

తెలుగుజాతి ఖ్యాతిని ఎన్టీఆర్‌ ప్రపంచానికి చాటిచెప్పారని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 28 May 2023 05:19 IST

బాన్సువాడ, వర్ని, న్యూస్‌టుడే: తెలుగుజాతి ఖ్యాతిని ఎన్టీఆర్‌ ప్రపంచానికి చాటిచెప్పారని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం చౌరస్తాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పోచారం, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోచారం మాట్లాడారు. ప్రస్తుత భారాసలో సగం మంది ఎన్టీఆర్‌ పెట్టిన భిక్షతో రాజకీయాల్లోకి వచ్చినవారే ఉన్నారని చెప్పారు. పక్కా ఇళ్ల పథకం, రూ.2కే కిలో బియ్యం వంటి పథకాలకు ఆయన నాంది పలికారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ తర్వాత రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచంలో తెలుగువారు తల ఎత్తుకునేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగామని, జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ యుగపురుషుడని అన్నారు. తిరుమలలో అన్నదానం ప్రారంభించడంతో పాటు దేశంలో అనేక సంక్షేమ పథకాలకు ఆయనే నాంది పలికారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని