యాదాద్రిలో మెరుగైన సౌకర్యాలు

యాదాద్రి ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.

Updated : 28 May 2023 05:21 IST

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో శనివారం రెండు శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఆలయాల ఆదాయాన్ని వాటి అభివృద్ధికే ఖర్చు చేయాలి. కొత్తగా చేపట్టిన ధూపదీప నైవేద్య పథకం వర్తింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. Ëసర్వ శ్రేయో నిధి (కామన్‌ గుడ్‌ ఫండ్‌) ద్వారా చేపట్టిన ఆలయాల అభివృద్ధి పనుల పురోగతి మరింత వేగంగా సాగాలి. అన్యాక్రాంతమైన దేవుడి భూముల్లో ఇప్పటికే 6,002 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి ఆలయ భూముల పరిరక్షణకు సహకరించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాం’ అని మంత్రి తెలిపారు.

ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహించాలి

రాష్ట్రవ్యాప్తంగా వీలున్న అన్ని ప్రాంతాల్లో ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. బీడీ ఆకు సేకరించే కార్మికుల ఖాతాల్లోకి ఛార్జీలు, బోనస్‌ సొమ్మును ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా చెల్లించే ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కోతుల బెడద నివారణకు నిర్మల్‌లో నెలకొల్పిన స్టెరిలైజేషన్‌ సెంటర్‌ తరహాలో దశలవారీగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌కు సూచించారు. టీఎస్‌పీఎస్సీతో సంప్రదింపులు జరిపి అటవీశాఖలో ఖాళీలను త్వరగా భర్తీ చేసేలా చూడాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని