ఎండకు మండిన జిల్లాలు

రాష్ట్రం ఎండలతో భగ్గుమంటోంది. అనేక జిల్లాల్లో మిట్టమధ్యాహ్నం వేడి సెగలు పుట్టడంతో ప్రజలు అల్లాడారు.

Published : 29 May 2023 05:03 IST

నల్గొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత
8 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదు
నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. ఎండలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం ఎండలతో భగ్గుమంటోంది. అనేక జిల్లాల్లో మిట్టమధ్యాహ్నం వేడి సెగలు పుట్టడంతో ప్రజలు అల్లాడారు. నల్గొండ జిల్లా నిడమనూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దామరచర్ల, హుజూర్‌నగర్‌, మఠంపల్లి, మోతె మండలాలు మండిపోయాయి. ఖమ్మం జిల్లాలో కూసుమంచి, ఖమ్మం అర్బన్‌, ముదిగొండ, బాణాపురంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో చాలా మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 40.3, హైదరాబాద్‌ జిల్లా ఆసిఫ్‌నగర్‌లో 39.9 డిగ్రీలు, జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 39.4 డిగ్రీల సెల్సియస్‌ పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌ మినహా అన్ని ప్రాంతాల్లో వాతావరణంలో తేమ శాతం 40 కన్నా తక్కువ నమోదైంది. నల్గొండలో అత్యంత అల్పంగా 17 శాతం మాత్రమే నమోదవ్వడం గమనార్హం. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంది. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొంది.

వడదెబ్బతో ఇద్దరి మృతి

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో వడదెబ్బ బారిన పడి ఇద్దరు మరణించారు. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన సాయిలు(72) ఆదివారం వడదెబ్బకు గురై ఇంట్లో కుప్పకూలి మృతిచెందారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం వనసేవక్‌ గంపల దేవదాసు(58) వడదెబ్బతో శనివారం రాత్రి చనిపోయినట్లు సర్పంచి గంపల సతీష్‌ తెలిపారు.


చల్లని ఉపాయం

మెహిదీపట్నానికి చెందిన ఆటో డ్రైవర్‌ హసన్‌.. తన ఆటో ఎక్కే ప్రయాణికులకు ఎండ వేడి తగలకుండా వాహనంపై ఇలా గ్రీన్‌ మ్యాట్‌ వేయించారు. ఆటో పైభాగం నుంచి గాలి వచ్చేలా రూఫ్‌ టాప్‌నకు డోర్‌ సైతం ఏర్పాటు చేసుకున్నారు. తన ఆటో ఎక్కే ప్రయాణికులు చల్లదనాన్ని పొందుతూ సంతోషం వ్యక్తంచేస్తున్నారని చెబుతున్నారు హసన్‌.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని