200 టన్నుల సామర్థ్యంతో నూనెల ప్యాకింగ్‌ యూనిట్‌

విజయ బ్రాండ్‌ నూనెల ఉత్పత్తిని పదిరెట్లు పెంచాలని రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఆయిల్‌ఫెడ్‌) నిర్ణయించింది.

Published : 29 May 2023 04:16 IST

రూ.10 కోట్లతో ఏర్పాటుకు ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయం
విజయ నూనెల ఉత్పత్తిని పదిరెట్లు పెంచడమే లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: విజయ బ్రాండ్‌ నూనెల ఉత్పత్తిని పదిరెట్లు పెంచాలని రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఆయిల్‌ఫెడ్‌) నిర్ణయించింది. ఇందుకోసం రోజుకు 200 టన్నుల సామర్థ్యంతో మెగా నూనెల ప్యాకింగ్‌ యూనిట్‌ను నిర్మించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విజయ నూనెలకు రోజుకు 150 టన్నుల మేర డిమాండ్‌ ఉందని సమాఖ్య అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం రోజుకు 20 టన్నుల మేర మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో రోజుకు 200 టన్నులు ఉత్పత్తి చేయడానికి ప్రతిపాదనలు రూపొందించింది. వీటికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. హైదరాబాద్‌ శివారు శివరాంపల్లిలో ప్రస్తుత ప్యాకింగ్‌ యూనిట్‌కు పక్కనే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిని వర్సిటీ ద్వారా కేటాయించింది. ఈ స్థలంలో రూ.పది కోట్లతో మెగా నూనెల ప్యాకింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు త్వరలోనే ఆయిల్‌ఫెడ్‌ శంకుస్థాపన చేయనుంది. ఆయిల్‌ఫెడ్‌ ప్రస్తుతం వేరుసెనగ, నువ్వులు, పామాయిల్‌, తవుడు (రైస్‌బ్రాన్‌), పొద్దుతిరుగుడు వంటనూనెలతో పాటు దీపం నూనె, కొబ్బరి నూనెలు ఉత్పత్తి చేస్తోంది. తాజాగా గానుగ నూనెను విడుదల చేసింది. త్వరలో ఆముదం, ఆవనూనెలను విడుదల చేయనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలకు అనుగుణంగా రాష్ట్రంలో నూనెగింజల సేకరణనూ సంస్థ పెంచనుంది. గింజల క్రషింగ్‌ కోసం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రెండు యూనిట్లు ఉండగా.. త్వరలో సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మరో రెండు యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది.

ఈ ఏడాది చివరికి కొత్త ప్యాకింగ్‌ యూనిట్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. భవిష్యత్తులో విజయ బ్రాండ్‌ నూనెలకు మరింత డిమాండ్‌ పెరిగితే మెగా యూనిట్‌ సామర్థ్యాన్ని 300 టన్నులకు పెంచుతామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నాణ్యమైన విజయ బ్రాండ్‌ నూనెలను ఊరూరా అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని