తెలంగాణ వర్సిటీలో వీసీ ఘెరావ్‌

తెలంగాణ వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌(వీసీ), పాలక మండలి(ఈసీ) మధ్య నెలకొన్న విభేదాలతో రిజిస్ట్రార్‌ నియామక వివాదం దుమారం రేపుతోంది.

Published : 31 May 2023 04:38 IST

ఛాంబర్లో చుట్టుముట్టిన విద్యార్థి సంఘాలు

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెలంగాణ వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌(వీసీ), పాలక మండలి(ఈసీ) మధ్య నెలకొన్న విభేదాలతో రిజిస్ట్రార్‌ నియామక వివాదం దుమారం రేపుతోంది. రెండు రోజుల తర్వాత మంగళవారం వర్సిటీకి వచ్చిన వీసీ రవీందర్‌ను తన ఛాంబర్‌లో పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, బీవీఎం(భారతీయ విద్యార్థి మోర్చా) విద్యార్థి సంఘాల నాయకులు చుట్టుముట్టి ఘెరావ్‌ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఛాంబర్లో టేబుల్‌పైకి ఎక్కి వీసీ గో బ్యాక్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అవినీతి వీసీని వెంటనే బర్తరఫ్‌ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అక్రమ నియామకాలు చేపట్టి రూ.లక్షలు వసూలు చేశారని, రూ.కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడినందుకు రాజీనామా చేయాలని నినదించారు. చివరికి ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు బయటకి తీసుకెళ్లడంతో ఛాంబర్‌ ఎదుట బైఠాయించారు.

ఈసీపై విచారణ చేయించాలి...

పాలకమండలి సభ్యులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారులు నవీన్‌ మిత్తల్‌, వాకాటి కరుణ, చంద్రకళతో పాటు ఇతర సభ్యులపై ఆరోపణలు ఉన్నాయని.. వారిపై విచారణ కమిటీ వేయాలని వీసీ రవీందర్‌ విలేకరులతో అన్నారు. నసీం రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు 20 మందికి పైగా అధ్యాపకులకు అక్రమంగా పదోన్నతులిచ్చారని, రవీందర్‌రెడ్డి ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్తగా అక్రమాలకు పాల్పడ్డారని, ప్రిన్సిపల్‌ ఆరతి ముందస్తు సమాచారం లేకుండా సెలవుల్లో వెళ్లారన్నారు. యాదగిరి 2021 ఏడాదిలోనే రిజిస్ట్రార్‌గా తప్పుకొన్నారని చెప్పారు. తాను ఆర్డర్‌ ఇచ్చిన కనకయ్యే రిజిస్ట్రార్‌గా కొనసాగుతారని స్పష్టంచేశారు. ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి పేరుతో వచ్చిన లేఖలో వాకాటి కరుణ సంతకం కాకుండా వేరే వాళ్ల సంతకం ఉన్నందున పరిగణనలోకి రాదన్నారు. జూన్‌ మొదటి వారంలో తానే ఈసీ సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.

వీసీ రవీందర్‌ పోలీసుల సాయంతో బయటికి రాగా.. విద్యార్థి నాయకులు మళ్లీ అడ్డుకున్నారు. వర్సిటీకి రిజిస్ట్రార్‌ ఎవరని ప్రశ్నించగా.. ఆర్డర్‌ ఉన్న కనకయ్యనే అని బదులిచ్చారు. మరి ఈసీ యాదగిరిని నియమించింది కదా అని అడగ్గా.. ఈసీకి ఆ అధికారం లేదన్నారు. దీంతో నిధుల దుర్వినియోగానికి బాధ్యత వహిస్తూ వీసీ రాజీనామా చేయాలంటూ నాయకులు పట్టుబట్టారు. వారు ఎంతకీ వినకపోవడంతో పోలీసులు వీసీని తమ వెంట తీసుకెళ్లారు.

జూన్‌ 3న జరిగే ఈసీ సమావేశం వరకు రిజిస్ట్రార్‌ ఛాంబర్‌కు ఎవరూ రావొద్దని అప్పటి వరకు గదికి తాళం వేసి ఉంటుందని యాదగిరి, కనకయ్య ఏకాభిప్రాయానికి వచ్చారు. వర్సిటీకి మంగళవారం వీసీ రావడంతో సిబ్బంది రిజిస్ట్రార్‌ ఛాంబర్‌ తెరిచినా.. ఆ హోదాలో ఎవరూ కూర్చోలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని