జనాభా నియంత్రణ పాటించడమే పాపమా?

జనాభా ప్రతిపాదికన 2026 తర్వాత జరగనున్న లోక్‌సభ స్థానాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 31 May 2023 03:43 IST

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్విభజనతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం
ఈ రాష్ట్రాల నాయకులు రాజకీయాలకతీతంగా గళమెత్తాలి
మంత్రి కేటీఆర్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: జనాభా ప్రతిపాదికన 2026 తర్వాత జరగనున్న లోక్‌సభ స్థానాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అధిక జనంతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను నమ్మి జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు నూతన డీలిమిటేషన్‌తో తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతాయని.. ఈ ధోరణి దురదృష్టకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై మంగళవారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జనాభా నియంత్రణ విధానాలు పాటించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ఈ రోజు శిక్షకు గురవుతున్నాయి. అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. కేవలం 18 శాతం జనాభా కలిగిన ఈ రాష్ట్రాలు 35% స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయి. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. అసంబద్ధమైన పునర్విభజన విధానంతో  భవిష్యత్తులో ప్రాధాన్యాన్ని కోల్పోకూడదు. ప్రగతిశీల విధానాలను అమలుపరుస్తున్నందుకు లబ్ధిపొందాల్సిన చోట.. తీవ్ర అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా దక్షిణాది నాయకులు, ప్రజలు గళమెత్తాలి’’ అని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.


వీళ్లు సంస్కారం లేని మూర్ఖులు

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘రేపిస్టులను సత్కరించేవారు.. హంతకులను స్వాగతించేవారు.. మహాత్మాగాంధీని హేళన చేసేవారు.. పరీక్ష పత్రాలను లీక్‌ చేసి, యువత జీవితాలతో ఆడుకునేవారు.. మన క్రీడా విజేతలను అవమానించేవారు.. వీరంతా సంస్కారం లేని మూర్ఖుల’ని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని రక్షించడానికి భారత ప్రభుత్వం ఎందుకు ఆరాటపడుతోందని ట్విటర్‌లో ఆయన ప్రశ్నించారు. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీకి ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా రక్షణ కల్పిస్తుండగా.. ఛాంపియన్లు, రెజర్లు మాత్రం తమ ఒలింపిక్‌ పతకాలను గంగా నదిలో విసర్జించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతటి అవమానకరం?’’ అని కేటీఆర్‌ మరో ట్వీట్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు