గ్రామీణ మహిళలకు బ్యాంకులు విరివిగా రుణాలివ్వాలి

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

Published : 31 May 2023 03:43 IST

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బ్యాంకులు పరిమితులను సడలించి మహిళా సంఘాలకు మరిన్ని రుణాలివ్వాలని కోరారు. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఒకేలా ఉండాలని, సర్వీసు ఛార్జీలను రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌)- బ్యాంకు లింకేజీ 2023-24 వార్షిక ప్రణాళికను ఆయన హైదరాబాద్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘గ్రామీణ పేద మహిళలను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. సంఘాల బ్యాంకు రుణ నిల్వలో, ఒక్కొక్క గ్రూపు రుణ నిల్వలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నాం. 2014-15 సంవత్సరంలో రూ.3,738 కోట్ల రుణాలిస్తే, 2022-23లో రూ.12,722 కోట్ల రుణాలిచ్చాం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 3,500 కోట్ల మేర రుణ విలువ పెరిగింది. 2023-24 సెర్ప్‌ బ్యాంకు లింకేజీ లక్ష్యం రూ.15,037.40 కోట్లు. ఆ మేరకు బ్యాంకులు రుణసాయం అందించాలి’’ అని ఎర్రబెల్లి కోరారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణాలతో చిన్న పరిశ్రమలు నెలకొల్పిన మహిళల విజయగాథల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళలకు, అధికారులకు పురస్కారాలు అందించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, ఆర్‌బీఐ ప్రతినిధి అమిత్‌, నాబార్డు సీజీఎం సుశీల చింతల, సెర్ప్‌ అధికారులు, డీఆర్‌డీవోలు, ఏపీడీలు, వివిధ సంఘాల మహిళలు, అధికారులు పాల్గొన్నారు.

పల్లెపల్లెనా పండగలా దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఉత్సవాలపై ఆయన దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని