ఒక్కో సంఘానికి రూ.20 లక్షల సాయం

తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు  2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,037.40 కోట్ల రుణసాయం అందనుంది.

Published : 01 Jun 2023 04:23 IST

మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.15,037 కోట్ల   రుణాలు
నిరుటి కంటే రూ.2315 కోట్లు అధికం
సెర్ప్‌ వార్షిక రుణ ప్రణాళికలో వెల్లడి

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు  2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,037.40 కోట్ల రుణసాయం అందనుంది. సెర్ప్‌ ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళా సంఘాలకు ఇదే అత్యధిక రుణసాయం కానుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.2315 కోట్లు అధికం. 3.08 లక్షల సంఘాల్లోని మహిళల అభ్యున్నతికి బ్యాంకులు ఈ రుణాలను అందించనున్నాయి. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 4,30,358 స్వయం సహాయక సంఘాల్లో 46,46,120 మంది సభ్యురాళ్లున్నారు. పొదుపు ఖాతాలను ప్రారంభించిన సంఘాలకు రుణసాయం పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. సంఘాలు తాము తీసుకున్న రుణాలను చెల్లించిన తర్వాత వాటి వడ్డీలను ప్రభుత్వం తిరిగి లబ్ధిదారులకు చెల్లిస్తోంది. గతేడాది సెర్ప్‌ రూ.12,000 కోట్ల బ్యాంకు రుణాలను లక్ష్యంగా నిర్దేశించగా, స్వయం సహాయక సంఘాలు రూ.12,722.14 కోట్ల రుణాలను పొందాయి. ఈసారి నిరుటి కంటే 18,905 ఎక్కువ స్వయం సహాయక సంఘాలకు సాయం అందనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున ఒక్కో డ్వాక్రా సంఘం రూ.20 లక్షల వరకు సాయం పొందే అవకాశం ఉంది.

98 శాతం చెల్లింపులు...

రుణాలు పొందిన సంఘ సభ్యుల్లో 98 శాతం మంది సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. 2014-15లో 8.8 శాతం నిరర్థక ఆస్తులు ఉంటే... అవి క్రమేపీ తగ్గుతూ మార్చి 31, 2023 నాటికి 1.62 శాతానికి చేరుకున్నాయి. దీంతో  బ్యాంకులు దరఖాస్తు చేసుకున్న సంఘాలన్నిటికీ రుణ సాయం అందిస్తున్నాయి.  2022-23లో ఒక స్వయం సహాయక సంఘానికి సగటున రూ.10లక్షలు అంతకన్నా ఎక్కువ బ్యాంకు రుణం అందింది. దేశంలోనే ఇది అత్యధికం. గ్రూపుల్లోని మహిళలు తీసుకున్న రుణాలలో 88 శాతం మేరకు వ్యాపారాభివృద్ధి ఆదాయాన్నిచ్చే ఇతర కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారు. 12 శాతం మేరకే వినిమయ ఛార్జీలుగా వాడారు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 490 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించడానికి రూ.2,910 కోట్లు విడుదల చేసింది. రుణసాయం పెంచడం ద్వారా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు.. మహిళల జీవనోపాధి అవకాశాలను పెంపొందిచడం. నైపుణ్యాలను మెరుగుపరచడం, మార్కెట్‌ అనుసంధానాల ద్వారా మరింత ఆదాయాలను కల్పించడాన్ని సెర్ప్‌ లక్ష్యంగా ఎంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు