కాచిగూడ, బేగంపేట స్టేషన్లకు ఆధునిక హంగులు

రాష్ట్రంలోని కాచిగూడ, బేగంపేట రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు సమకూరనున్నాయి. వీటితో పాటు ద.మ.రైల్వే జోన్‌ పరిధిలో రాజమహేంద్రవరం, గూడూరు, నాందేడ్‌ రైల్వే స్టేషన్లను కూడా తీర్చిదిద్దనున్నారు.

Published : 01 Jun 2023 04:22 IST

రాజమహేంద్రవరం, గూడూరు, నాందేడ్‌కు కూడా..
‘అమృత్‌ భారత్‌’లో  మరో 105 స్టేషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాచిగూడ, బేగంపేట రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు సమకూరనున్నాయి. వీటితో పాటు ద.మ.రైల్వే జోన్‌ పరిధిలో రాజమహేంద్రవరం, గూడూరు, నాందేడ్‌ రైల్వే స్టేషన్లను కూడా తీర్చిదిద్దనున్నారు. ఈ స్టేషన్ల పునరభివృద్ధి పనులకు సంబంధించి అధ్యయనం చేయించాలన్న రైల్వే జోన్‌ సూచన మేరకు.. ద.మ.రైల్వే కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆయా స్టేషన్ల మాస్టర్‌ ప్లాన్లు తయారు చేయనున్నారు. భవిష్యత్తులో పెరిగే రైళ్లు, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషను నుంచి వివిధ ప్రాంతాలకు అనేక ప్రధాన రైళ్లు బయల్దేరుతుంటాయి. బేగంపేట ముఖ్యమైన రైళ్లకు హాల్టుగా ఉంది. సికింద్రాబాద్‌లో రద్దీ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు బేగంపేటలో ఎక్కుతుంటారు. ఏపీలోని రాజమహేంద్రవరం, గూడూరు రైల్వే స్టేషన్లకు ప్రాధాన్యం ఉంది. ఈ రెండు స్టేషన్లను కూడా పునరభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

దశలవారీగా అభివృద్ధి

జోన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్లను ప్రాధాన్యాన్ని బట్టి దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. తొలిదశలో సికింద్రాబాద్‌, తిరుపతి, నెల్లూరు స్టేషన్ల పునరభివృద్ధి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రూ.699.77 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులను 2025 నవంబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.299.29 కోట్లతో చేపట్టిన తిరుపతి స్టేషన్‌ పనులను 2025 ఫిబ్రవరి నాటికి, రూ.102.04 కోట్లతో చేపట్టిన నెల్లూరు స్టేషన్‌ పనులను 2024 మే నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం. మహారాష్ట్రలోని జాల్నా, ఔరంగాబాద్‌ స్టేషన్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ద.మ.రైల్వేలో మరో 105 రైల్వే స్టేషన్లనూ పునరభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత్‌ భారత్‌ పథకంలో వీటిని చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని