TSLPRB Recruitment: ఒక్కో పోస్టుకు ఆరుగురి పోటీ!

రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాల్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తదుపరి అంకంపై దృష్టి సారించింది.

Updated : 02 Jun 2023 08:19 IST

17,516 ఉద్యోగాలు.. 1.09 లక్షల మంది అభ్యర్థులు
ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియ
10-12 రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాల్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తదుపరి అంకంపై దృష్టి సారించింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నమైంది. ఈసారి 17,516 పోస్టుల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం 1,79,459 మంది అభ్యర్థులు తుది రాతపరీక్షలకు హాజరు కాగా.. 1,50,852 (84.06%) మంది అర్హత సాధించారు. వీరిలో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో అర్హత సాధించారు. ఆ జాబితాను వడబోసిన అనంతరం మొత్తం అభ్యర్థుల సంఖ్య 1.09 లక్షలుగా తేల్చారు. ఈ లెక్కన ఒక్కో పోస్టు కోసం సగటున ఆరుగురికి పైగా పోటీ పడుతున్నారు. పోలీస్‌ యూనిట్ల వారీగా ఉన్న ఖాళీల ఆధారంగా ఆయా జిల్లాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం కటాఫ్‌ మార్కులే ప్రాతిపదిక కానున్నాయి. జిల్లాల్లో పోస్టులకు అనుగుణంగా.. సామాజిక వర్గాల వారీగా ఖాళీల ఆధారంగానే కటాఫ్‌ మార్కుల్ని నిర్ణయించి, ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేయనున్నారు.

18 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన..

ప్రస్తుతం అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం రాష్ట్రవ్యాప్తంగా క్రితంసారి మాదిరిగానే 18 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు కేంద్రాలతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇవి ఉండనున్నాయి. 587 ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ధ్రువపత్రాల్లో పెద్దగా తప్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. వీరిలో 20-30 మంది మాత్రమే అనర్హులుగా తేలే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదే 16,929 కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో మాత్రం 700-800 మంది అనర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించే అవకాశాలను తోసిపుచ్చలేమని మండలి వర్గాలు చెబుతున్నాయి.


మూడో వారంలోగా కొలిక్కి..

ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలనే ప్రణాళికల్లో ఉన్నారు. మొత్తం 1.09 లక్షల మంది పత్రాల్ని పరిశీలించాల్సి ఉండటంతో ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 500-600 మంది అభ్యర్థులను పిలవాలని నిర్ణయించారు. అలా ఈ ప్రక్రియను 10-12 రోజుల్లోగా పూర్తి చేయాలని మండలి వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా జూన్‌ మూడో వారంలోపు ఈ ప్రక్రియ కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని