సచివాలయం నుంచి వేడుకలు షురూ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వైభవంగా జరగనుంది. దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయంలో ప్రారంభించనున్నారు.

Published : 02 Jun 2023 04:12 IST

జాతీయజెండాను ఎగురవేయనున్న సీఎం కేసీఆర్‌
జిల్లాల్లో హాజరుకానున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
రాజ్‌భవన్‌లో పాల్గొననున్న గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వైభవంగా జరగనుంది. దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయంలో ప్రారంభించనున్నారు. తొలుత గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ చేసి, దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు, ఇతర కార్యక్రమాలు కొనసాగుతాయి.

మొత్తం 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తారు. లబ్ధిదారులు, ప్రజలతో సభలు, ర్యాలీలు, ప్రదర్శనలు జరుపుతారు. పోటీలు, కవి సమ్మేళనాలు, పురస్కారాలు, సత్కారాలు నిర్వహిస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుపుతారు. ఉత్సవాలను పురస్కరించుకొని సచివాలయం, శాసనసభ, మండలి, బీఆర్‌కే భవన్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ప్రభుత్వంతో పాటు విపక్ష కాంగ్రెస్‌, భాజపా ఆధ్వర్యంలోనూ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి.

జిల్లాల వారీగా జెండావందనం చేసేది వీరే

కామారెడ్డి- శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ- శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జోగులాంబ గద్వాల- ఉపసభాపతి పద్మారావు, వరంగల్‌- శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్‌..

మంత్రులు పాల్గొనే జిల్లాలు..

రాజన్న సిరిసిల్ల- కేటీ రామారావు, సిద్దిపేట- హరీశ్‌రావు, మహబూబ్‌నగర్‌- శ్రీనివాస్‌గౌడ్‌, వనపర్తి- నిరంజన్‌రెడ్డి, మహబూబాబాద్‌- సత్యవతి రాథోడ్‌, సూర్యాపేట- జగదీశ్‌రెడ్డి, సంగారెడ్డి- మహమూద్‌అలీ, ఖమ్మం- పువ్వాడ అజయ్‌, కరీంనగర్‌- గంగుల కమలాకర్‌, జగిత్యాల- కొప్పుల ఈశ్వర్‌, మెదక్‌- తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి- మల్లారెడ్డి, నిర్మల్‌- ఇంద్రకరణ్‌రెడ్డి, రంగారెడ్డి- సబితారెడ్డి, నిజామాబాద్‌- వేముల ప్రశాంత్‌రెడ్డి, జనగామ- ఎర్రబెల్లి దయాకర్‌రావు..

చీఫ్‌ విప్‌లు, విప్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు..

పెద్దపల్లి- భానుప్రసాద్‌రావు, హనుమకొండ- దాస్యం వినయ్‌భాస్కర్‌, యాదాద్రి భువనగిరి- గొంగిడి సునీత, ఆదిలాబాద్‌- గంప గోవర్ధన్‌, భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావు, కుమురంభీం ఆసిఫాబాద్‌- శంభీపూర్‌ రాజు, మంచిర్యాల- బాల్క సుమన్‌, ములుగు- ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, నాగర్‌కర్నూల్‌- గువ్వల బాలరాజు, నారాయణపేట- మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, వికారాబాద్‌- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జయశంకర్‌ భూపాలపల్లి- రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

రాజ్‌భవన్‌లో..

రాజ్‌భవన్‌లో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొంటారు. దర్బారు హాలులో ఉదయం 10 నుంచి 11 వరకు ఆమె ప్రజలతో, ప్రముఖులతో భేటీ అయి, శుభాకాంక్షలు తెలియజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని