గుత్తేదారులు ముందుకొచ్చారు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో మొత్తం 17 ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు ఎట్టకేలకు గుత్తేదారులు ముందుకు వచ్చారు.

Updated : 03 Jun 2023 07:56 IST

17 ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు త్వరలో చర్యలు
హైదరాబాద్‌-విజయవాడ రహదారి పనులకు మూడు టెండర్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో మొత్తం 17 ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు ఎట్టకేలకు గుత్తేదారులు ముందుకు వచ్చారు. అయిదు నెలలుగా సాగుతున్న వాయిదా పర్వం కొలిక్కి వచ్చింది. గడిచిన ఏడాది డిసెంబరులో టెండర్లు ఆహ్వానిస్తే ఎట్టకేలకు తాజాగా మూడు గుత్తేదారు సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం. సాంకేతిక, ఆర్థిక బిడ్స్‌ను పరిశీలించిన మీదట వచ్చే వారంలో గుత్తేదారును ఖరారు చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. నెలాఖరులోగా ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తరవాత గుత్తేదారు పనులు చేపడతారని తెలిపారు. రూ.333 కోట్లతో ఆయా ప్రాంతాలను ప్రమాదరహితంగా చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని 2025 నాటికి ఆరు వరుసలకు విస్తరించాలన్నది రహదారి నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయం. ఏపీ విభజన తరవాత నుంచి ఈ మార్గంలో రాకపోకలు తగ్గటంతో టోల్‌ వసూలు వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థకు, రహదారి నిర్మాణ సంస్థకు మధ్య వివాదం తలెత్తింది. ఆ మార్గాన్ని ఆరు వరుసలకు విస్తరించాలా? వద్దా? అన్న అంశంపై నాలుగైదేళ్లుగా తర్జన భర్జనలు సాగుతున్నాయి. మునుపటితో పోలిస్తే ట్రాఫిక్‌ రద్దీ తగ్గిన నేపథ్యంలో ఆరు వరుసలకు విస్తరించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. అంతేకాకుండా ఈ రహదారిలో ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

పెరిగిన వ్యయం...

తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను చక్కదిద్దేందుకు కేంద్రం రూ.265 కోట్లతో పనులు చేపట్టాలని తొలుత నిర్ణయించింది. ఆ తరవాత అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించాలని నిర్ణయించటంతో నిర్మాణ వ్యయం రూ.333 కోట్లకు పెరిగినట్లు సమాచారం.

ప్రమాదకర ప్రాంతాలివే...

పెదకాపర్తి, చిట్యాల బైపాస్‌రోడ్డు, నల్గొండ క్రాస్‌రోడ్డు, కట్టంగూర్‌, కొర్లపహాడ్‌, సూర్యాపేట సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల, జనగామ క్రాస్‌రోడ్డు, సూర్యాపేట శివారున, దురాజ్‌పల్లి క్రాస్‌రోడ్‌, ముకుందాపురం, ఆకుపాముల బైపాస్‌రోడ్‌, కోమరబండ క్రాస్‌రోడ్‌, కటకమ్మగూడెం క్రాస్‌రోడ్‌, మేళ్లచెరువు క్రాస్‌రోడ్‌, శ్రీరాంపురం, రామాపురం క్రాస్‌రోడ్‌, నవాబ్‌పేట... వీటిని ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించారు. గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఏడాదిన్నరలో పనులు చేసేందుకు వీలుగా టెండర్లు ఆహ్వానించారు. పదేళ్లపాటు ఆయా ప్రాంతాల నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారుదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని