లాభాల బాటలోకి ఆర్టీసీ

నష్టాల బాట నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మే నెలలో గట్టెక్కింది. ఒక్క నెలలో ఏకంగా రూ.23 కోట్ల లాభాల్ని గడించింది.

Updated : 03 Jun 2023 06:13 IST

మే నెలలో రూ.23 కోట్ల మిగులు కలిసివచ్చిన వేసవి సెలవులు, వివాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: నష్టాల బాట నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మే నెలలో గట్టెక్కింది. ఒక్క నెలలో ఏకంగా రూ.23 కోట్ల లాభాల్ని గడించింది. వేసవి సెలవులకు తోడు పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా ఆర్టీసీకి ఆదాయం భారీగా వచ్చింది. గడిచిన మూడు, నాలుగేళ్లలో సంస్థకు లాభాలు తెచ్చిపెట్టిన నెల ఇదేనని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

రూ.574.71 కోట్ల ఆదాయం : మే నెలలో ఆర్టీసీ 9.21 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. టికెట్లు, ఇతరత్రా కలిపి రూ.574.71 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.551.71 కోట్లు ఖర్చు కాగా, రూ.23 కోట్ల లాభాలు వచ్చాయి. ఏప్రిల్‌ నెలలో రూ.485.29 కోట్ల ఆదాయాన్ని పొందిన సంస్థ రూ.46.05 కోట్ల నష్టాలపాలైంది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో సంస్థకు రూ.89.42 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది. సాధారణంగా ఏడాదిలో ఇతర నెలలతో పోలిస్తే మేలో ఆర్టీసీకి ఆదాయం భారీగా వస్తుంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు భారీగా ఉంటాయి. సెలవుల్లో ఊర్లకు..ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రదేశాలకు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈనెలలో సాధారణంగా ఆదాయం ఎక్కువ ఉంటుంది.

లాభాలు ఎలా సాధ్యమయ్యాయి?

ఆర్టీసీకి గత మేతో పోలిస్తే ఈ మే నెలలో లాభాలు రావడానికి ప్రయాణికుల సంఖ్య 1.21 శాతం, బస్సులు తిరిగిన దూరం 4.26 శాతం పెరిగినట్లు కనిపిస్తున్నా పెరిగిన ఆదాయంతో పోలిస్తే అది చాలా స్పల్పం. బస్సుల్లో సీట్ల భర్తీ తగ్గినా లాభాలు రావడానికి.. వివిధ సెస్సులతో పరోక్షంగా పెరిగిన ఛార్జీలతో పాటు ఇంధన ఖర్చు తగ్గడం సంస్థకు కలిసివచ్చినట్లు గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని