ఊరూవాడా ‘వ్యవసాయ పండగ’

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. ఊరూరా ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శనలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో ఉత్సాహంగా ర్యాలీలు సాగాయి.

Published : 04 Jun 2023 04:58 IST

అన్నదాతల ఆధ్వర్యంలో ఘనంగా రైతు దినోత్సవం  
అన్నిచోట్ల భారీ ర్యాలీలు, ప్రదర్శనలు
సాగు విజయాలపై చర్చలు
మంత్రులు, ప్రజాప్రతినిధుల హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. ఊరూరా ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శనలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో ఉత్సాహంగా ర్యాలీలు సాగాయి. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్లు, గోదాములు, రైతుబజార్లను, సమీకృత మార్కెట్లను అలంకరించారు. విత్తనాలు, కూరగాయలు, పండ్లు, బిందు, సూక్ష్మసేద్యం ప్రదర్శనలు నిర్వహించారు. శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌, రైతుబంధు సమితిల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ముందస్తు పంట సీజన్‌పై కరపత్రాలను విడుదల చేశారు. ఉత్తమ రైతులను సత్కరించారు. సమావేశాల అనంతరం రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు సహపంక్తి భోజనాలు జరిగాయి.

* శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌ మండలం బైరాపూర్‌, బాన్సువాడ మండలం దేశాయిపేట, సదాశివనగర్‌ మండలం పద్మాజివాడల్లో జరిగిన రైతు దినోత్సవాలలో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్‌ నడిపారు.

* శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలో ముఖ్య అతిథిగా పాల్గొని, రైతులకు స్వయంగా భోజనాలను వడ్డించారు.

* మంత్రులు... ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో, కంఠాయపాలెం, అమ్మాపురం, ఏడునూతులలో, శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ మండలం కోడూరులో, మహమూద్‌అలీ హైదరాబాద్‌ మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్‌యార్డులో, పువ్వాడ అజయ్‌ రఘునాథపాలెంలో, జగదీశ్‌రెడ్డి ఏండ్లపల్లిలో, వేముల ప్రశాంత్‌రెడ్డి వన్నెల్‌(బి)లో, ఇంద్రకరణ్‌రెడ్డి ఎల్లపల్లిలో, సత్యవతిరాథోడ్‌ చల్వాయిలో, గంగుల కమలాకర్‌ దుర్శేడులో, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌యార్డులో, కొప్పుల ఈశ్వర్‌ పొలాస, మల్లారెడ్డి మూడుచింతలపల్లి, కీసర, అలియాబాద్‌, రాయిలాపూర్‌లలో, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధర్మసాగర్‌, వేలేరులో రైతు దినోత్సవాల్లో పాల్గొన్నారు.

*  సీఎస్‌ శాంతికుమారి యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సదాశివనగర్‌ మండలం పద్మాజీవాడలో పాల్గొన్నారు.

* సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి నుంచి తల్లపెంట రైతువేదిక వరకు 5కి.మీ. పొడవున బైకులు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

*  సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యంతో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల చిత్రపటాలు వేశారు.

తెలంగాణలో సాగు విప్లవం: నిరంజన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల కారణంగా తెలంగాణలో వ్యవసాయ విప్లవం సాకారమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణకు, భూమికి విడదీయరాని అనుబంధముంది. ఈ రాష్ట్రంలో 58% సేద్యంపైనే ఆధారపడి జీవిస్తుండటమే దీనికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం ఛిద్రమైంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం కేంద్రంగా తీసుకుంటున్న చర్యలతో నేడు రాష్ట్రంలో సామాజిక పరివర్తన సాధ్యమైంది. పాలకులంటే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ... సాధించిన విజయాలను ఆహ్వానించకపోవడం సరికాదు’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ విద్యా సంచాలకుడు గంట చక్రపాణి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి వీసీ రఘునందన్‌రావు పాల్గొన్నారు.


దండగన్న చోటే పండగైంది: కేటీఆర్‌

వ్యవసాయం దండగ అన్నచోటే పండగైందని.. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే రెండు కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైందని మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. నాడు కరవుతో అల్లాడిన తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వ పెట్టే అన్నపూర్ణగా మారిందని తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నిర్వహిస్తున్న రైతు దినోత్సవం సందర్భంగా కేటీఆర్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘నెర్రెలు బారిన ఈ నేల తొమ్మిదేళ్లలోనే దేశానికి ధాన్యాగారమైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని కిసాన్‌ సర్కారే. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా 65 లక్షల మంది రైతులకు రూ.66 వేల కోట్ల పెట్టుబడి సాయంగా అందించిన ఏకైక ప్రభుత్వం మాది. వివిధ కారణాలతో 1.7 లక్షల మంది రైతులు మృతి చెందగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున... మొత్తం రూ.5,039 కోట్లను పరిహారంగా చెల్లించి ఆదుకుంది. 27 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్న తొలిరాష్ట్రం తెలంగాణ. ప్రతిదశలోనూ రైతుకు అండగా ఉండేందుకు 10,769 గ్రామాల్లో రైతుబంధు సమితులు ఏర్పాటు చేశాం.  ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ చొప్పున 2,601 రైతువేదికలను ఏర్పాటు చేశాం. తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది’’అని కేటీఆర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని