వ్యాక్సిన్లపై పరిశోధనలకు ప్రపంచం చేతులు కలపాలి

‘వ్యాధులపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని కొవిడ్‌-19 మహమ్మారి గుర్తుచేసింది. ఈ క్రమంలో అన్ని దేశాలు చేతులు కలిపి వ్యాక్సిన్లపై పరిశోధనలు, అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు.

Updated : 04 Jun 2023 06:04 IST

కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
జీ 20 సమావేశాల్లో భాగంగా నగరంలో సదస్సు

రాయదుర్గం, న్యూస్‌టుడే: ‘వ్యాధులపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని కొవిడ్‌-19 మహమ్మారి గుర్తుచేసింది. ఈ క్రమంలో అన్ని దేశాలు చేతులు కలిపి వ్యాక్సిన్లపై పరిశోధనలు, అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. రాయదుర్గం ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో శనివారం జీ 20 సమావేశాల్లో భాగంగా గ్లోబల్‌ వ్యాక్సిన్‌ రీసెర్చ్‌ కొలాబరేటివ్‌ సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా భారతదేశం వ్యాక్సిన్లపై పరిశోధనలు, అభివృద్ధికి కృషి చేస్తోందని, దాని ఫలితంగానే పోలియో, స్మాల్‌ పాక్స్‌, మీజిల్స్‌ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రతకు భారత్‌ నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారి సమయంలో కొవాగ్జిన్‌ను 100 శాతం నగరంలోనే పరిశోధించి తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వం జీనోమ్‌ వ్యాలీని ఏర్పాటు చేసిందని, ప్రపంచ దేశాల ప్రతినిధులు అక్కడ తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడుతూ ప్రపంచానికి 60 శాతం వ్యాక్సిన్లను భారత్‌ అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఔషధాలశాఖ కార్యదర్శి ఎస్‌.అపర్ణ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సర్‌ జెరేమీ జె ఫరర్‌, సెపీ సీఈవో డా.రిచర్డ్‌హ్యాచెట్‌, పాత్‌ అధ్యక్షుడు, సీఈవో నికోలజ్‌ గిల్‌బర్ట్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకో ఇన్‌ఫెక్షన్‌ కేంద్రం, ల్యాబ్‌ నెట్‌వర్క్‌

కొవిడ్‌-19 వంటి అత్యవసర వైద్యసవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. జీ 20లో భాగంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు హైదరాబాద్‌లో మూడో హెల్త్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.64 వేల కోట్లతో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ఇన్‌ఫెక్షన్‌ కేంద్రం, ల్యాబ్‌ నెట్‌వర్క్‌, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. రాబోయే అయిదేళ్లలో ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దేశాల మధ్య వైద్యపరంగా పరస్పర సహకారం కోసం జీ 20 ప్రయత్నిస్తోంది. ఆ దిశగా విధానాల రూపకల్పనపై సమావేశాల్లో చర్చిస్తాం’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని