మతతత్వ, అవినీతి పాలకులను ఓడిద్దాం

దేశంలో విద్వేష, మతతత్వ.. రాష్ట్రంలో అవినీతి, ఆర్థిక దోపిడీ ప్రభుత్వాలను ఓడించడానికి ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.

Updated : 04 Jun 2023 06:06 IST

భారాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే
‘జాగో తెలంగాణ’ సమావేశంలో వక్తలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో విద్వేష, మతతత్వ.. రాష్ట్రంలో అవినీతి, ఆర్థిక దోపిడీ ప్రభుత్వాలను ఓడించడానికి ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణలో భారాస గెలిస్తే భాజపా గెలిచినట్లే. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు కేసీఆర్‌ వెంట ఉన్నారు. కర్ణాటకలో పార్టీలకు అతీతంగా 33 పౌరసంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ప్రజల్లో చైతన్యం నింపాయి. అదే వ్యూహం తెలంగాణలో అనుసరిస్తే ప్రజలు పాలకులకు సరైన గుణపాఠం చెబుతారు. దీనికోసమే రాజకీయాలకు అతీతంగా పోరాడే వ్యక్తులు, పౌరసంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. జాగో తెలంగాణ నెట్‌వర్క్‌గా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో ప్రజల పక్షాన, ప్రజల ప్రయోజనాలే కేంద్రంగా పనిచేయడానికి నిర్ణయించాం’ అని పలువురు వక్తలు తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ‘జాగో తెలంగాణ’ పేరుతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, గాదె ఇన్నయ్య, సొగరా బేగం, శంకర్‌, పాశం యాదగిరి, నయనాల గోవర్ధన్‌, స్కైబాబు, కోలా జనార్దన్‌, వెంకటదాస్‌, ప్రొఫెసర్లు వినాయక్‌ రెడ్డి, లక్ష్మీనారాయణ, రమా మెల్కొటే, సుశీల, అన్వర్‌ఖాన్‌, వెంకటనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

త్వరలో తెలంగాణ ప్రజల మేనిఫెస్టో రూపొందించాలని తీర్మానించారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా భారాస మద్దతిచ్చింది. ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఓటువేసినా ఒక్కటే. ఎంఐఎం కూడా వేరు కాదు. ప్రజలంతా హిందూ, ముస్లిం మతోన్మాదాన్ని వ్యతిరేకించాలి. రాష్ట్రంలో కమీషన్ల కోసం పెద్ద నిర్మాణాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులెవరైనా మంత్రివర్గంలో ఉన్నారా? కాంగ్రెస్‌కు కూడా మేం మద్దతివ్వం’ అని తెలిపారు. మత విద్వేష రాజకీయాలు, ప్రైవేటీకరణతో కేంద్రంలో భాజపా.. అవినీతి, దోపిడీ, రాజ్యాధికార కాంక్షతో తెలంగాణలో భారాసలు కేంద్రాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని ఆకునూరి మురళి విమర్శించారు. 65 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేసిన దోపిడీ కన్నా తెలంగాణ వచ్చాక జరిగిన దోపిడీ వంద రెట్లు ఎక్కువని ఆరోపించారు. మన ఊరు-మన బడి పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా వాస్తవానికి పెట్టింది రూ.432 కోట్లు మాత్రమేనని, నీళ్లు, నిధులు అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇదే సరైన సమయమని గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి, వెంకటదాస్‌, పాశం యాదగిరి, సొగరా బేగం, అన్వర్‌ఖాన్‌, నయనాల గోవర్ధన్‌, శంకర్‌, రమా మెల్కొటే తదితరులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం ఎవరివైపు నిలవాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని స్కైబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని