ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు కసరత్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ ఆరంభం అయింది.

Updated : 04 Jun 2023 08:58 IST

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు!

ఈనాడు, హైదరాబాద్‌: పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు కసరత్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ ఆరంభం అయింది. పోలింగ్‌ కేంద్రం పరిధిలో మునుపటి కన్నా ఓటర్ల సంఖ్య పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. హేతుబద్ధీకరణ ద్వారా ఒకే ఇంట్లోని వారు ఓటేసేందుకు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక నుంచి ప్రతి కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1,500 మంది ఓటర్లు ఉండేలా చూడాలన్న కసరత్తుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినట్లు సమాచారం. గతంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో పట్టణాల్లో 1,200 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,400 మంది ఓటర్లు ఉండేవారు. అంతకు మించితే ఆయా కేంద్రాల పరిధిలో అనుబంధ స్టేషన్‌ ఏర్పాటు చేసేవారు. ఓటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి ఎన్నికల సమయంలో సుమారు రెండు నుంచి మూడు వేల వరకు పెరుగుతున్నాయి.

పోలింగ్‌ కేంద్రాలను పకడ్బందీగా జియోగ్రాఫికల్‌ మ్యాపింగ్‌  చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మ్యాపింగ్‌ చేసే సమయంలో ఇంటి నంబర్లనూ పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఒక ఇంటి నంబరులోని ఓటర్లు అంతా ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని సంఘం సూచించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మ్యాపింగ్‌ విధానాన్ని ముందుగా చేయాలని అధికారులకు సూచించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ చెప్పారు. ఈ ఏడాది జనవరి అయిదో తేదీన ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా 34,891 పోలింగ్‌ కేంద్రాలు అవసరమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ఓటర్ల జాబితా సవరణ నిరంతరాయంగా సాగుతున్న నేపథ్యంలో ఓటర్ల సంఖ్య పెరగనుంది. ఆ మేరకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్య కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం పంపిన 63,120 బ్యాలెట్‌ యూనిట్లు, 49,310 కంట్రోల్‌ యూనిట్లు, 53,255 వీవీప్యాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని