ప్రజాప్రయోజన వ్యాజ్యాలు.. న్యూసెన్స్‌ కేసులుగా మారాయి

ప్రజాప్రయోజన వ్యాజ్యాలు.. పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసులుగా మారాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ‘ఇ-మీడియేషన్‌ రైటింగ్స్‌’ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బేగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘ఈఎండబ్ల్యూ పార్లమెంట్‌’లో గవర్నర్‌ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Published : 05 Jun 2023 05:29 IST

పేదలకు మధ్యవర్తిత్వం ద్వారా సాయపడాలి: గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు.. పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసులుగా మారాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ‘ఇ-మీడియేషన్‌ రైటింగ్స్‌’ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బేగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘ఈఎండబ్ల్యూ పార్లమెంట్‌’లో గవర్నర్‌ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. కోర్టుల్లో ఏళ్లపాటు కేసులు పెండింగ్‌లో ఉండకుండా.. మధ్యవర్తిత్వం (మీడియేషన్‌) ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గవర్నర్‌గా తాను అనేకసార్లు సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేసినట్లు తెలిపారు. ‘మీడియేషన్‌, మెడిటేషన్‌ పదాల్లో తేడా ఉన్నా రెండూ ఒకటే. మధ్యవర్తిత్వం నెరపాలంటే చాలా ఓపిక, ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే అందులో విజయం సాధిస్తారు’’ అని తెలిపారు. విడిపోతున్న వివాహబంధాన్ని ఏకం చేయడంలో మీడియేషన్‌ విఫలమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ.. ఏ వ్యవస్థ మీదైనా సామర్థ్యానికి మించి భారం పెరిగితే నిర్వహణ కష్టతరమవుతుందన్నారు. కోర్టులపై కేసుల భారం పెరుగుతోందని, దానిని తగ్గించేందుకు మీడియేషన్‌ ఉపయోగపడుతుందని అన్నారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. న్యాయవాదులు మాత్రమే మీడియేషన్‌ చేస్తారని అనుకోరాదని తెలిపారు. లోక్‌అదాలత్‌లో రాజీమార్గంలో కేసులు వేగంగా పరిష్కారమవుతున్నా అన్నింట్లో ఆ విధానం సాధ్యపడదని వివరించారు.

ప్రభావవంతమైన, చవకైన పరిష్కారం మీడియేషన్‌ అని పట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి అన్నారు. ఇ-మీడియేషన్‌ రైటింగ్స్‌ వ్యవస్థాపకులు పుష్ప్‌గుప్తా మాట్లాడుతూ.. ఎవరైనా 40 గంటల మీడియేషన్‌ శిక్షణ తీసుకుంటే మీడియేటర్లుగా మారవచ్చని చెప్పారు. లిటిగేటస్‌ ప్రైమ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, లిటిగేటస్‌ ఛైర్మన్‌ ఎల్‌.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని