పోలీసింగ్‌ ప్రగతి ప్రస్థానం ఆవిష్కారం

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘సురక్షా దినోత్సవ’ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి.

Published : 05 Jun 2023 05:31 IST

దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సురక్షా దినం
పోలీసు శాఖ విజయాల్ని వివరిస్తూ ప్రదర్శనలు

ఈనాడు- హైదరాబాద్‌: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘సురక్షా దినోత్సవ’ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం శాంతి భద్రతల పరిరక్షణకు జరిగిన కృషి, పోలీసింగ్‌ ప్రజలకు చేరువయ్యేందుకు చేసిన ఆవిష్కరణలు, పోలీసు శాఖ సాధించిన విజయాలను వివరిస్తూ ఆదివారం రాజధాని సహా జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త రాష్ట్రంలో పోలీసు శాఖకు ప్రభుత్వం అందించిన చేయూత, సమకూర్చిన అత్యాధునిక పరిజ్ఞానాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు జరిగాయి. కొన్ని పోలీస్‌స్టేషన్లలో ఆయుధాల్ని ప్రదర్శనకు ఉంచారు. హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పోలీసులు నిర్వహించిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో తెలంగాణ పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ ప్రత్యేకంగా టెక్నాలజీ ఎక్స్‌పో నిర్వహించాయి.

హైదరాబాద్‌లో గల్లీగల్లీలో ర్యాలీలు

* ట్యాంక్‌బండ్‌లోని పెలికాన్‌ సిగ్నల్‌ నుంచి, లిబర్టీ, అబిడ్స్‌, ఎంజే మార్కెట్‌, చార్మినార్‌ వరకూ.. అక్కడి నుంచి మళ్లీ ఎంజే మార్కెట్‌, రవీంద్రభారతి, ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, నెక్లెస్‌రోడ్డులోని సంజీవయ్య పార్కు వరకూ వాహనాలతో మెగార్యాలీ జరిగింది. పెట్రోలింగ్‌ కార్లు, వందల సంఖ్యలో బ్లూకోల్ట్స్‌ నిర్వహించిన ఈ ర్యాలీ అబ్బురపరిచింది. రాచకొండ రోడ్డు భద్రత, షీ టీమ్స్‌ డీసీపీ శ్రీబాల ఈ ర్యాలీలో ముందుండి బుల్లెట్‌ వాహనం నడిపారు. ర్యాలీని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, డీజీపీ అంజనీకుమార్‌ ప్రారంభించారు.

* హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ సాంకేతిక ప్రదర్శన నిర్వహించాయి. ఫింగర్‌ప్రింట్‌, ఫోరెన్సిక్‌, నార్కోటిక్‌, రైల్వే పోలీసులు, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు పాల్గొన్నారు.

*  రాచకొండ పోలీసులు ఎల్బీనగర్‌ చౌరస్తా నుంచి ఉప్పల్‌ వరకూ మెగా ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. ఉప్పల్‌లో ఫ్లాష్‌ మాబ్‌ ఏర్పాటు చేశారు.

* సైబరాబాద్‌ పోలీసులు స్ట్రైకింగ్‌ డ్రిల్‌ పేరుతో గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌, ఐటీసీ కోహినూర్‌లో పోలీసు సిబ్బంది ఆయుధాలతో డ్రిల్‌ నిర్వహించారు.

* వరంగల్‌ నగరంలో పెట్రోలింగ్‌ వాహనాలు, బ్లూకోల్ట్స్‌, అగ్నిమాపక, షీ టీమ్స్‌, ట్రాఫిక్‌ విభాగాలతో కలిసి భారీ వాహన ర్యాలీ నిర్వహించారు.

* మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ జెండా ఊపి పోలీసు వాహనాల ర్యాలీ ప్రారంభించారు.

* జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ర్యాలీతో పాటు.. కలరియపట్టు యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. కత్తులు, గొడ్డలి, బల్లెంతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

* జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. మంచిర్యాలలో డాగ్‌ స్క్వాడ్‌తో ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాంక్‌బండ్‌పై అంబరాన్నంటిన సంబురాలు

రాంనగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై హోంశాఖ ఆధ్వర్యంలో మహిళా సురక్ష సంబరాలను ఘనంగా నిర్వహించారు. మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మహిళా కమిషన్‌ ఛైౖర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖాగోయెల్‌ ప్రసంగించారు. తెలంగాణలో పోలీసు శాఖ ప్రగతి పథాన్ని, రాష్ట్ర అభివృద్ధికి సాగుతున్న కృషిని వారు ప్రస్తావించారు. ‘మహిళల భద్రత..అందరి శ్రేయస్సు’ అనే షార్ట్‌ మూవీని శిఖాగోయెల్‌ విడుదల చేశారు. ఉమన్‌ సేఫ్టీ వింగ్‌ ప్రచురించిన ‘ఇన్‌ ద ఫ్రంట్‌ లైన్‌’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన డ్రమ్స్‌ను వాయించి వారు అందరినీ ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, సినీ నటుడు నాని, క్రీడాకారిణి నైనా జైస్వాల్‌, శాండిల్య, అనుప్‌ రూబెన్స్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని