ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో మూకుమ్మడి అరెస్టులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండున్నర నెలలుగా జరుగుతున్న దర్యాప్తులో ఇప్పటి వరకూ 50 మందిని అరెస్టు చేశారు.

Updated : 05 Jun 2023 05:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో మూకుమ్మడి అరెస్టులకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండున్నర నెలలుగా జరుగుతున్న దర్యాప్తులో ఇప్పటి వరకూ 50 మందిని అరెస్టు చేశారు. ఒకటి రెండు వారాల్లో ఒకేసారి అనేక మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు డీఈఈ రమేశ్‌ ద్వారా లబ్ధి పొందిన వారే 30 మంది వరకూ ఉండవచ్చని సమాచారం. వాస్తవానికి తొలుత కమిషన్‌ ఉద్యోగుల ద్వారా ప్రశ్నపత్రాలు అంచెలంచెలుగా అనేక మందికి చేరాయి. కొద్దిరోజుల క్రితంటీఎస్‌పీఎస్సీ కార్యాలయం వారితో సంబంధం లేకుండా మాస్‌కాపీయింగ్‌ చేయించిన విద్యుత్తుశాఖ డీఈఈ రమేశ్‌ ముఠాను సిట్‌ అధికారులు గుర్తించారు. లీకేజీలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు వచ్చాక తన ఇంటి సమీపంలో ఉండే టీఎస్‌పీడీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌కు ఇచ్చాడని.. అతడు ఏఈఈ/డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడని... సురేష్‌ ద్వారా అతడి బంధువైన డీఈఈ రమేశ్‌ రంగప్రవేశం చేశాడని సిట్‌ పేర్కొంటోంది. ప్రస్తుతం రమేశ్‌, సురేష్‌తోపాటు మొత్తం ఏడుగుర్ని కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఏఈఈ, డీఏవో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన ఓ కళాశాల ప్రిన్సిపల్‌ అలీతో రమేశ్‌ ఒప్పందం కుదుర్చుకొని ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని మాస్‌కాపీయింగ్‌ చేయించాడు. ఒక్కొక్కరు రూ.30 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని ఏఈఈ పరీక్షలో నలుగురితో, డీఏవో పరీక్షలో ముగ్గురితో మాస్‌కాపీయింగ్‌  చేయించాడు. దాంతోపాటు ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరో 30 మందికి అమ్ముకున్నట్లు తేలింది. ఇది కాకుండా సురేష్‌ మరో 78 మందికి ఏఈఈ ప్రశ్నపత్రాన్ని అమ్ముకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రమేశ్‌, సురేష్‌ల వాంగ్మూలాలు నమోదు తర్వాత ఇతరత్రా ఆధారాలు సేకరించనున్నారు. అనంతరం ఇందులో భాగస్వామ్యం ఉన్న వారందర్నీ అరెస్టు చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని