ఐటీ నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అద్భుత పురోగతి

తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 07 Jun 2023 05:02 IST

టీఎస్‌ ఐపాస్‌.. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం
పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, నల్గొండ: తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐటీ నుంచి ఆహార ఉత్పత్తుల వరకు దేశంలోనే తెలంగాణ అద్భుత పురోగతి సాధిస్తుండటంతో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల కోసం కాకుండా రాబోయే తరాల కోసం పనిచేస్తారని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో ఆయన మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కన చేనేత ఉత్పత్తుల షోరూమ్‌కు శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పార్కులో నూతనంగా నిర్మించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, కామన్‌ ఫెసిలిటీ కేంద్రం, వ్యర్థాల శుద్ధి కేంద్రం, పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రధాన కార్యాలయంతో పాటు ఏకకాలంలో 51 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రారంభించారు. రూ.150 కోట్లతో 106 ఎకరాలలో నిర్మించే బొమ్మల తయారీ పార్కుకు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవాడలో రూపొందించిన ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి తిలకించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘ప్రపంచంలోనే టీఎస్‌ ఐపాస్‌ అత్యుత్తమ పారిశ్రామిక విధానం. ఈ తరహా అనుమతులు అమెరికాలోనూ లేవు. పారిశ్రామికవేత్తలంతా తొమ్మిదేళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలి. ఈ తొమ్మిదేళ్లలో దేశానికే తెలంగాణ పాఠాలు నేర్పింది. అమెరికాలోని సివిల్‌ ఇంజినీర్లు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అభినందించారు. గుజరాత్‌లో భాజపా 27 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఇప్పటికీ అక్కడ పరిశ్రమలకు సరిగ్గా విద్యుత్తు సరఫరా చేయలేక రెండు రోజులు పవర్‌ హాలిడేలను ప్రకటిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 6నెలల్లోనే పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును ఇచ్చిన ఘనత తెలంగాణది. ప్రతి పరిశ్రమ స్థాపనలో 10% బడ్జెట్‌ను పచ్చదనానికి కేటాయించాలని సీఎం నిర్ణయించారు. 65 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కేవలం ఈ 9 ఏళ్లలోనే మేం చేసి చూపించాం. హైదరాబాద్‌ చుట్టుపక్కల అనేక పారిశ్రామిక సమూహాలను ఏర్పాటు చేసుకున్నాం. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో స్థానికులకే ఉద్యోగాలు అందేలా చూస్తాం. అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమైతే ప్రత్యక్షంగా 40 వేల మందికి ఉపాధి లభించనుంది’’ అని కేటీఆర్‌ అన్నారు. అనంతరం గ్రామీణ పారిశ్రామిక, చేనేత రంగాల్లో ప్రతిభ కనబర్చినవారికి పురస్కారాలు అందజేశారు. టిఫ్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని