గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది.

Updated : 07 Jun 2023 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌, ఈడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షను నిర్వహించరాదని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ఎస్‌.మురళీధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పి.మాధవీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దర్యాప్తు కొనసాగుతుండగా అదే కమిషన్‌ పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులకు అనుమానం ఉందని తెలిపారు. గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు గైర్హాజరైనవారిని రెండోసారి నిర్వహించే పరీక్షకు అనుమతించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి అప్పగించాలని కోరారు. సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే ఒక పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని.. దీనిపై దర్యాప్తు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిందని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉన్నదానితో జత చేయాలని ఆదేశించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని