పురపాలికల్లో ప్రతి శనివారం పునరాలోచన

రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో ప్రతి శనివారం ‘పునరాలోచన దినం’ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగించి, పక్కన పడేసిన వస్తువులను అర్హులైన వారికి ఉచితంగా ఇచ్చేందుకు ప్రజా చైతన్యాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

Published : 07 Jun 2023 03:35 IST

 పక్కన పడేసిన వస్తువులు పునర్వినియోగానికి..
సేకరణకు ప్రత్యేక కేంద్రాలు
ఉత్తర్వుల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో ప్రతి శనివారం ‘పునరాలోచన దినం’ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగించి, పక్కన పడేసిన వస్తువులను అర్హులైన వారికి ఉచితంగా ఇచ్చేందుకు ప్రజా చైతన్యాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. పట్టణ ప్రగతిలో భాగంగా పునరాలోచన దినాన్ని నిర్వహించాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ప్రతి శనివారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని మున్సిపల్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ మంగళవారం అన్ని పురపాలక సంఘాలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఇళ్లలో వినియోగించిన పుస్తకాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బొమ్మలు, సంగీత వాయిద్యాలు, చెప్పులను ప్రజల నుంచి స్వీకరించనున్నారు. ఇళ్లలో వివిధ వస్తువులను తగ్గించుకోవాలనుకునే వారి కోసం ప్రతి శనివారం ‘పునరాలోచన దినం’ నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాటిని తగ్గించుకోవటం (రెడ్యూస్‌), తిరిగి వాడకం (రీ-యూజ్‌), అందుకు వీలుగా తయారు చేయటం (రీ-సైకిల్‌)..గా పేర్కొంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ పేరిట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వాటి నిర్వహణకు మహిళా సంఘాల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆయా వస్తువులను సేకరించి.. అర్హులైన వారికి ఉచితంగా పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇతరులకు ఉపయోగపడటమే కాకుండా పర్యావరణానికి ముప్పుగా మారకుండా చర్యలు తీసుకోవాలన్నది వ్యూహం. స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌ల ద్వారా వాటిని పునర్వినియోగానికి వీలుగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి దీన్ని ప్రజా ఉద్యమంగా మలచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని