కిక్కిరిసిన లైన్లు.. రైలెనక రైళ్లు!

ఒడిశా దుర్ఘటనలో ప్రమాదానికి ముందు, ప్రమాద సమయంలో- గూడ్సు రైలు, కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకే లైన్‌లో ఉన్నాయి. మెయిన్‌ అప్‌ లైన్‌లో వెళుతున్న గూడ్సు బండిని ఆ వెనుకే, అదే ట్రాక్‌పై వస్తున్న కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ కోసం లూప్‌లైన్‌లోకి మళ్లించారు.

Updated : 08 Jun 2023 09:17 IST

సామర్థ్యానికి మించి రాకపోకలు
లైన్ల వినియోగం 120-245 శాతం వరకు
కీలక మార్గాల్లోనూ సింగిల్‌ ట్రాకే
మంజూరు చేసిన వాటికీ ఏళ్ల తరబడి జాప్యం
పనులు మొదలుపెట్టినచోట సరిపడాలేని కేటాయింపులు
ఈనాడు - హైదరాబాద్‌

ఒడిశా దుర్ఘటనలో ప్రమాదానికి ముందు, ప్రమాద సమయంలో- గూడ్సు రైలు, కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకే లైన్‌లో ఉన్నాయి. మెయిన్‌ అప్‌ లైన్‌లో వెళుతున్న గూడ్సు బండిని ఆ వెనుకే, అదే ట్రాక్‌పై వస్తున్న కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ కోసం లూప్‌లైన్‌లోకి మళ్లించారు. కారణం.. ఆ ట్రాక్‌లో సామర్థ్యానికి మించి రైళ్లు రాకపోకలు సాగిస్తుండడమే. ఇదే రకమైన పరిస్థితి దేశంలోని అనేక జోన్లలో ఉంది. జోన్‌లో, దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైళ్లు, గూడ్సు బండ్ల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నా ఆ మేరకు అదనపు లైన్లు అందుబాటులోకి రావట్లేదు. కొన్ని సెక్షన్ల పరిధిలో గరిష్ఠ పరిమితి కంటే రెట్టింపు రైళ్లు ప్రయాణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రైళ్లు, బండ్ల పెరుగుదలకు అనుగుణంగా రైలు మార్గాల విస్తరణ జరగట్లేదు. ద.మ.రైల్వే సహా దేశంలో పలు సెక్షన్లలో ట్రాక్‌ల సామర్థ్యానికి మించి రైళ్లను నడిపిస్తున్నారు. 100 శాతంలోపే ఉండాల్సిన రైల్వే లైను వినియోగం 120-245 శాతం వరకు ఉంటోంది. 2023 మే, జూన్‌ నెలల్లో రైళ్ల రద్దీ మరింత పెరుగుతుంది. బీబీనగర్‌-నడికుడి సహా అనేక సెక్షన్లలో సింగిల్‌ ట్రాక్‌పైనే, ఎదురెదురుగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో సిగ్నలింగ్‌లో ఏ చిన్నలోపం తలెత్తినా.. విధుల్లోని సిబ్బందిలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశముంది.

పరిమితికి మించి...

ద.మ.రైల్వే జోన్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, గుంతకల్‌, విజయవాడ, గుంటూరు, నాందేడ్‌.. డివిజన్లలో ట్రాక్‌ సామర్థ్యానికి మించి రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గూడ్సు రైళ్లను, ప్యాసింజర్‌ రైళ్లను మార్గంమధ్యలో నిలిపివేసి వెనక వచ్చే    సూపర్‌ఫాస్టు రైళ్లకు దారిస్తున్నారు. పలు మార్గాల్లో రైళ్ల వేగం 110-130 కిలోమీటర్లకు  పెరగడంతో రైలు మార్గాలపై ఒత్తిడి పెరుగుతోంది.

* జోన్‌లో బీబీనగర్‌-నడికుడి సెక్షన్‌ అత్యంత రద్దీ మార్గం. తిరుపతి వందేభారత్‌, విశాఖ దురంతో, విజయవాడ ఇంటర్‌సిటీ వంటి వేగవంతమైన రైళ్లు సహా శబరి, నారాయణాద్రి, ఫలక్‌నుమా, నర్సాపూర్‌, గుంటూరు ఇంటర్‌సిటీ, జన్మభూమి, గోల్కొండ, విశాఖ, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ వంటి అనేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. మోటమర్రి-మేళ్లచెరువు-విష్ణుపురం సెక్షన్‌ నుంచి ఆ ప్రాంతంలోని సిమెంటు పరిశ్రమల నుంచి గూడ్సు రైళ్లూ అధికం. ఉన్నది ఒకటే ట్రాక్‌.. ఎదురెదురు ప్రయాణాలు... ఒక రైలు వస్తుంటే మరో బండిని ఏదైనా స్టేషన్‌లో లూప్‌లైన్‌లో ఆపాలి. రెండోలైను మంజూరు చేయాలని చాలాకాలం నుంచి డిమాండ్‌ ఉంది. మూడేళ్ల క్రితం రెండోలైను మంజూరు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించినా నేటికీ పనులు మొదలుకాలేదు.

* సికింద్రాబాద్‌-కాజీపేట అత్యంత రద్దీమార్గం. కానీ ఇప్పటివరకు మూడో లైను మంజూరు కాలేదు. సికింద్రాబాద్‌-వికారాబాద్‌ వైపు సింగిల్‌ లైన్‌ ట్రాక్‌ మాత్రమే ఉంది.

* సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య రెండోలైను పూర్తయినా అక్కడి నుంచి కర్నూలు, డోన్‌ వైపు ఒకే లైన్‌ ఉంది

* మోటుమర్రి-విష్ణుపురం రెండో లైను ఇంకా సర్వేదశలోనే ఉంది. 401 కి.మీ. ఉన్న గుంటూరు-గుంతకల్‌ రెండో లైను పనుల్లో 70 కిలోమీటర్లు మాత్రమే పనులు    పూర్తయ్యాయి.

* సికింద్రాబాద్‌-కాచిగూడ మధ్య నిత్యం 93 రైళ్లు నడుస్తున్నాయి. 2027-28 నాటికి ఆ సంఖ్య 116కి పెరిగి సెక్షన్‌ వినియోగం 190 శాతానికి పెరగనుంది. ఈ మార్గం విస్తరణకు ఇప్పటివరకు ప్రణాళికలు లేవు. అదే సమయానికి మేడ్చల్‌-మనోహరాబాద్‌ 367 శాతానికి.. మనోహరాబాద్‌-నిజామాబాద్‌ మధ్య 260, నిజామాబాద్‌-ముద్కేడ్‌ 263, కర్నూలు-డోన్‌ 174 విజయవాడ-రాయనపాడులో 181 శాతానికి వినియోగం పెరగనుంది. ఆయా మార్గాల్లో లైన్ల విస్తరణకు ప్రణాళికలు అత్యవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని