38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్‌

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) బుధవారం కౌన్సెలింగ్‌ కాలపట్టికను విడుదల చేసింది.

Updated : 08 Jun 2023 05:49 IST

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి 6 విడతల కౌన్సెలింగ్‌
జులై 26వ తేదీతో పూర్తి
ఆ తర్వాత ఎన్‌ఐటీల్లో మిగిలిన సీట్లకు సీశాబ్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) బుధవారం కౌన్సెలింగ్‌ కాలపట్టికను విడుదల చేసింది. మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఈ నెల 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల కానుండగా...ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. కాకపోతే ఈ నెల 27 వరకు విద్యార్థులకు అవగాహన కోసం మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఐఐటీ గువాహటి నిర్వహించగా...సీట్ల భర్తీ కూడా ఆ సంస్థే చేపడుతుంది. మొత్తానికి ఆరు విడతల కౌన్సెలింగ్‌కు 38 రోజులపాటు పట్టనుంది. జులై 26న చివరి విడత సీట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత ఐఐటీలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రత్యేకంగా సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ బోర్డు (సీశాబ్‌) ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరుపుతారు. గత ఏడాది 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ ఐటీలు, 30 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేశారు. ఈ సంవత్సరం  ఏఏ సంస్థలో ఎన్ని సీట్లున్నాయో త్వరలో ప్రకటిస్తామని ఐఐటీ గువాహటి తెలిపింది.

ఇదీ ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌

* జూన్‌ 19-27: నమూనా కౌన్సెలింగ్‌. దానివల్ల తాము ఇచ్చిన ఐచ్ఛికాలతో ఎక్కడ సీటు రావొచ్చో అంచనా వస్తుంది. దాన్నిబట్టి మళ్లీ ఆప్షన్లు మార్చుకోవచ్చు.

* జూన్‌ 28: రిజిస్ట్రేషన్‌, ఆప్షన్లు ఇచ్చుకోవడం..30వ తేదీన తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు.. జులై 6న  2వ.. 12న 3వ.. 16న 4వ.. 21న 5వ.. 26వ తేదీ 6వ రౌండ్‌ సీట్ల కేటాయింపు.


జోసా కౌన్సెలింగ్‌ తర్వాతే ఎంసెట్‌ చివరి విడత...

జోసా కౌన్సెలింగ్‌తో పాటు ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కూడా జులై 31న ముగియనున్నందున ఈసారి ఎంసెట్‌ విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టిక కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకారం చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 2వ తేదీ నుంచి మొదలవుతుంది. అప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు పూర్తవుతాయి. దానివల్ల చాలా వరకు ఈసారి ఇబ్బందులు తప్పుతాయని  ఎంసెట్‌ అధికారులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని