Hyderabad-NIMS: దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతి

దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతికి హైదరాబాద్‌ వేదిక కానుంది. నిమ్స్‌కు అనుబంధంగా అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Updated : 08 Jun 2023 09:32 IST

25 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
త్వరలో టెండర్ల ఆహ్వానానికి కసరత్తు
అంచనా వ్యయం రూ.1,570 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతికి హైదరాబాద్‌ వేదిక కానుంది. నిమ్స్‌కు అనుబంధంగా అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ ప్రాంగణంలో 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం అవుతోంది. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌) పేరుతో రూ.2,100 కోట్ల వ్యయంతో సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లో భారీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. నిమ్స్‌ను కూడా భారీగా విస్తరించాలని నిర్ణయించింది. ఆ ప్రాంగణంలో అవకాశం లేకపోవటంతో నిమ్స్‌కు సమీపంలోని కాలం చెల్లిన ప్రభుత్వ క్వార్టర్ల స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి రహదారులు, భవనాల శాఖ ప్రణాళిక రూపొందించింది. ఆయా క్వార్టర్లను స్వాధీనం చేసుకుని వాటిని కూల్చి వేశారు. ఈ నెల 14న ఆ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసేందుకు వీలుగా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.

34 విభాగాలు... 2,100 పడకలు

నూతన ప్రాంగణంలో వైద్య రంగానికి చెందిన 34 రకాల ప్రత్యేక విభాగాలు(స్పెషలైజేషన్‌ డిపార్ట్‌మెంట్లు) ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్మాణం చేపట్టనున్నారు. 2,100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దనున్నారు. రూ.1,570 కోట్ల వ్యయంతో ఈ అధునాతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిమ్స్‌ 22 ఎకరాల విస్తీర్ణంలో 1,300 పడకలతో ఉంది. గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి 36 నెలల్లో ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నది అధికారుల లక్ష్యంగా ఉంది.

ఇదే పెద్దది ఎలాగంటే...

నిమ్స్‌కు అనుబంధంగా నిర్మించే ఆసుపత్రి భవనమే దేశంలో అతిపెద్ద ఆసుపత్రి భవంతిగా రికార్డుల్లో నమోదు అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశంలోని ఎయిమ్స్‌తోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులను పరిగణనలోకి తీసుకున్నా ఇదే పెద్ద భవనం అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు భవనాలతో భారీ విస్తీర్ణంలో ఆసుపత్రులున్నప్పటికీ 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే భవనం దేశంలో ఎక్కడా లేదని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. ఈ ఆసుపత్రి భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 32 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో కొంత భూమి ఆసుపత్రి నిర్మాణానికి అనుకూలంగా లేదని అధికారులు గుర్తించారు. కేటాయించిన దానిలో మూడు ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. మరికొంత ప్రభుత్వ భూమిలో రహదారులు ఉన్నాయి. నిర్మాణానికి అనువుగా 26 ఎకరాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ విస్తీర్ణంలో భవన సముదాయానికి, పార్కింగ్‌కు, పచ్చదనానికి వినియోగించాలని నిర్ణయించారు.


కరీంనగర్‌ వైద్య కళాశాలకు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. వంద సీట్లతో కళాశాలకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించనున్న తొమ్మిది వైద్య కళాశాలలకూ పూర్తిస్థాయి అనుమతులు వచ్చినట్లయింది. వాటిలో ఆసిఫాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌, జనగామ, సిరిసిల్ల, నిర్మల్‌, భూపాలపల్లి, కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో వంద సీట్లతో మొత్తం 900 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.  కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి రావడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా కొత్తగా 21 కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని